Tuesday, September 10, 2024

ఈ ఏడాదైనా..ఇడబ్లూఎస్ కోటా అమలయ్యేనా?

- Advertisement -
- Advertisement -

అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఇడబ్లూఎస్ రిజర్వేషన్లు దేశంలోని దాదాపు అన్ని కోర్సులలో అమలవుతుండగా మెడికల్ సీట్లలో మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. పిజిలో ఇప్పటివరకు ఇడబ్లూఎస్ కోటా అమలు కాలేదు. ఎంబిబిఎస్ సీట్లలో మాత్రం నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసి) అనుమతి ఇచ్చిన ఏడు కాలేజీల్లోనే ఈ కోటా అమలవుతోంది. అయితే ఈ ఏడాది కూడా కోటా పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో ఏడు కళాశాలల్లోనే ఎంబిబిఎస్ సీట్ల భర్తీలో ఇడబ్లూఎస్ కోటా అమలు చేస్తున్నారు. మిగిలిన కాలేజీల్లో అమలు కావడం లేదు. ఇడబ్ల్యూఎస్ కోటాను కేంద్రం 2019లో ప్రవేశపెట్టింది.

మొత్తం సీట్లలో 10 శాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించాలి. ఇడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే ఇతరుల రిజర్వేషన్ దెబ్బతినకుండా ఉండేందుకు సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా సీట్లు పెంచిన తర్వాతే కోటాను అమలు చేయాలి.. అన్ని రకాల విద్యా సంస్థల్లోనూ సీట్ల సంఖ్య పెంచారు. అయితే ఎన్‌ఎంసి నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇలా సీట్ల సంఖ్య పెంచడానికి వీలు కాలేదు. దాంతో ఉన్న సీట్లలోనే ఇడబ్లూఎస్ కోటా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంబిబిఎస్ ప్రవేశాల్లో ఈ ఏడాది నుంచి అన్ని వైద్య కళాశాలల్లో ఇడబ్ల్యూఎస్ కోటా అమలు చేయడానికి ఇటీవల అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో మాత్రవ దీన్ని పూర్తిగా అమలు చేయడం లేదు. ఇడబ్లూఎస్ కోటా అమలుపై వైద్యఆరోగ్యశాఖ దృష్టి సారించకపోవడం వల్లనే మన రాష్ట్రంలో విడుదల కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ్ర

పిజిలో అమలుకాని ఇడబ్లూఎస్ కోటా
వైద్యవిద్యలో ఎంబిబిఎస్ సీట్ల భర్తీలో ఏడు కళాశాలలు, ఆయుష్ యుజి, పిజి కోర్సులలో ఇడబ్లూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ మెడికల్ పిజి కోర్సులలో మాత్రం ఈ కోటా అమలు కావడం లేదు. ప్రస్తుతం ఎంబిబిఎస్, ఇతర కోర్సులలో అమలు చేస్తున్నట్లుగా మెడికల్ పిజి కోర్సులకు కూడా ఇడబ్లూఎస్ కోటాను అమలు చేయాలి. అందుకోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేకంగా మెడికల్ పిజి సీట్లను సృష్టించి ఆయా రాష్ట్రాల మెడికల్ యూనివర్సిటీలకు అందజేయాలి. గత కొన్నేళ్లుగా మెడికల్ పిజి సీట్లలో ఇడబ్లూఎస్ కోటా అమలుపై ఎన్‌ఎంసి తాత్సారం చేయడంతో ప్రతిభ గల అగ్రవర్ణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెడికల్ పిజి కోర్సులలో ఇడబ్లూఎస్ కోటా అమలు చేయకపోవడం పట్ల వైద్య విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్ పిజి సీట్లకు భారీగా డిమాండ్
వైద్య విద్యలో పిజి సీట్లకు భారీగా డిమాండ్ ఉంది. ఎంబిబిఎస్ తర్వాత వైద్య విద్యార్థులలో చాలామంది పిజి చేసేందుకు మొగ్గు చూపుతారు. ప్రైవేట్‌లో ఈ సీట్లు కోట్లు పలుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ పిజి సీట్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సీట్లకు కూడా ఇడబ్లూఎస్ కోటా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి లేఖ రాశాం : డాక్టర్ కరుణాకర్ రెడ్డి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్
మెడికల్ సీట్ల భర్తీలో ఇడబ్లూఎస్ కోటా అమలుపై ఇప్పటికే తాము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈ ఏడాది నుంచి ఈ కోటాను అమలు చేస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News