Thursday, September 19, 2024

నేడో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తివేత !

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నదీపరివాహకంగా ఎగువన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికే 873.40అగులకు చేరుకుంది. నీటి నిలువ కూడా 156.39టిఎంసీలకు చేరింది. ఎగువనుంచి రోజుకు 40టిఎంసీలకు పైగా వరదనీరు రిజర్వాయర్‌లోకి చేరుకుంటోంది. మరో 59టిఎంసీల నీరు చేరితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోనుంది. అయితే నీటిమట్ట 800అడుగులకు చేరుకోగానే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఎగువ నుంచి వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తివేత:
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇటు తుంగభద్ర నుంచి అటు జూరాల నుంచి 4.41లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది. ఎగువన ఆల్మట్టిలోకి 2.68లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, గేట్ల తెరిచి 3.25లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. నారాయణపూర్‌నుంచి కూడా 2.98లక్షల క్కూసెక్కుల నీరు దిగువకు వదులు తున్నారు. జూరాలకు ఎగువ నుంచి 3లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 2.98లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు, కోయిల్ సాగర్ , భీమ కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఎగువ నుంచి 1.24లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 28గేట్ల ద్వారా 1.51లక్షల క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నారు. సుంకేసులకు 1.02లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 26గేట్లు తెరిచి 99736క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు.

మరో 1540క్యూసెక్కుల నీటిని కేసి కాలువకు విడుదల చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కుడి గట్టు పవర్‌హౌస్ ద్వారా 18480క్యూసెక్కులు, ఎడమగట్టు పవర్‌హౌస్ ద్వారా 35315క్యూసెక్కుల నీటని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2000క్యూసెక్కుల నీటిని ఎస్‌ఆర్‌ఎంసి కాలువలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి 53774క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 6441క్యూసెక్కలు కాలువలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 510.20అడుగులకు చేరింది.

భద్రాచలం వద్ద రెండో పమాద హెచ్చరిక :
గోదావరిలో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 48.6అడుగులు ఉండగా, రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ప్రాణహిత నుంచి మేడిగడ్డ వద్ద 4లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. సమ్మక్క సాగర్ వద్ద 8.45లక్షలు, దుమ్ముగూడెం వద్ద 11.65లక్షల క్కూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News