ఉద్యోగాల కోసమని వెళ్లి థాయ్లాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ప్రయత్నం ఫలించింది. మొత్తం 540 మంది బందీలను గుర్తించగా వీరిలో తెలంగాణ, ఏపీకి చెందిన 42 మంది ఉన్నారు. వీరందరినీ 270 మంది చొప్పున రెండు విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయగా సోమవారం 270 మందితో కూడిన తొలి విమానం థాయ్లాండ్ మై సోట్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. మంగళవారం మరో 270 మందితో రెండో విమానం ఇండియాకు రానుందని బండి సంజయ్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి వీరంతా విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు.
థాయ్లాండ్ కేంద్రంగా వీరందరికీ ఉద్యోగాలిప్పిస్తామని స్థానిక ఏజెంట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఆయా యువతకు ఆశ చూపారు. వీరిలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన మధుకర్రెడ్డి అనే యువకుడు ఇలాగే కొలువు కోసం వెళ్లి బందీగా మారిన విషయం మీడియాలో వచ్చింది. వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ వారిని రప్పించేందుకు చర్యలు చేపట్టారు. భారత విదేశాంగశాఖకు స్వయంగా లేఖ రాశారు. మయన్మార్, థాయ్లాండ్ దౌత్యకార్యాలయాలను అప్రమత్తం చేశారు. ఈ నేఫథ్యంలో మయన్మార్ ప్రభుత్వం తన ఆర్మీని పంపి సైబర్ ఫ్రాడ్ కేఫ్లో బంధీలుగా ఉన్న భారతీయులను రక్షించింది.