వివాహిత హత్యకేసులో నిందితులు అరెస్టు
కట్టుకున్న వాడే కాలయముడు..
తోబుట్టిన అన్న కసాయివాడే..
48 గంటల్లో కేసును చేధించిన పోలీసులు
మన తెలంగాణ/కాటారం : కట్టుకున్న భర్త, తోబుట్టిన అన్న ఇద్దరు కలిసి వివాహితను చంపిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపెల్లి గ్రామ శివారులోని జరిగింది. మహిళ హత్య కేసులో కాటారం పోలీసులు 48గంటల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందుతులను అరెస్టు చేసి నిందితులను రిమాండ్కు పంపినట్లు కాటారం డిఎస్పీ బోనాల కిషన్ శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చెద్నేపల్లి గ్రామానికి చెందిన మేనెం స్వప్న తన భర్త మేనెం శ్రీనివాస్ కలిసి జీవిస్తోంది. స్వప్న అదే గ్రామానికి చెందని మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకున్నారు. స్వప్న అన్న బుర్ర రాజు, ఆముదాల రఘు, అతని స్నేహితుడు మామిడి సాయికిరణ్ల సహకారంతో ఆమెను గ్రామ శివారులో హత్య చేశారు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని కేసు నమోదు చేశారు. హత్యకేసును 48 గంటల్లోనే చేధించిన మహాదేవపూర్ సిఐ తెలబోయిన కిరణ్, అతనికి సహకరించిన కాటారం ఎస్సై సాంబమూర్తి, పోలీస్ సిబ్బందిని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ అభినందించారు. నిందితులు బుర్ర రాజు, శ్రీనివాస్, రఘు, సాయికిరణ్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.