Sunday, April 27, 2025

నన్ను ఈ దేశంలోనే ఉండనివ్వండి.. ఇప్పుడు నేను భారత కోడలిని

- Advertisement -
- Advertisement -

పహల్‌గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం దాయాది పాకిస్తాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. వాటిలో భాగంలో భారత్‌లో ఉంటున్న పాకిస్తానీలను ఈ నెల 27 నాటికి దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) ఈ మేరకు గురువారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలు అన్నీ ఈ నెల27తో రద్దు అవుతాయని ఎంఇఎ తెలిపింది. అయితే, మెడికల్ వీసాలపై ఉన్నవారికి మాత్రం 29 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో పాక్ జాతీయురాలు సీమా హైదర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై సీమా హైదర్ తాజాగా స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేసింది. ‘నేను పాకిస్తాన్ తనయను. కానీ ఇప్పుడు భారత కోడలిని’ అని ఆమె తెలిపింది. తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఆ దేశానికి తనను పంపవద్దని,

భారత్‌లోనే ఉండేందుకు అనుమతించాలని సీమా ప్రధాని నరేంద్ర మోడీకి, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందు మతాన్ని స్వీకరించినట్లు ఆమె గుర్తు చేసింది. దాయాది పాక్‌పై భారత్ అంతటా వ్యతిరేకత ఉన్నప్పటికీ సీమా హైదర్‌ను దేశంలో నివసించడానికి అనుమతిస్తారని ఆశిస్తున్నానని ఆమె తరఫు న్యాయవాది ఎపి సింగ్ చెప్పారు. సీమా హైదర్ భారత పౌరుని పెళ్లాడి, ఒక కుమార్తెకు జన్మ ఇచ్చిందని ఆయన తెలిపారు. అందుకే ఆమె పాక్ పౌరురాలు కాదని, భారత్‌ను విడిచి వెళ్లవలసిన అవసరం ఉండకపోవచ్చునని న్యాయవాది అన్నారు. కాగా, పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ ఆన్‌లైన్‌లో పబ్‌జి గేమ్ ద్వారా పరిచయమైన యుపికి చెందిన సచిన్ మీనా కోసం తన నలుగురు పిల్లలతో కలసి 2023 మేలో కరాచీ నుంచి భారత్‌కు వచ్చిన విషయం విదితమే. ఆమె దేశ సరిహద్దు దాటి అక్రమంగా భారత్‌లోకి అడుగుపెట్టి, ఆ తరువాత ప్రియుని పెళ్లాడింది. ఆ దంపతులు ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News