న్యూఢిల్లీ : ఎవరో ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ కారణంగా పాకిస్థాన్లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సీఈఓ జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఇటీవల జో రోగన్ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్లో ఫేస్బుక్ సంస్థపై నమోదైన దావా గురించి వెల్లడించారు. ‘ వివిధ దేశాల్లో మనం అంగీకరించని చాలా చట్టాలున్నాయి. ఉదాహరణకు పాకిస్థాన్లో నాకు మరణశిక్ష విధించాలంటూ ఎవరో దావా వేశారు. ఎవరో ఫేస్బుక్లో దేవుడిని అవమానిస్తూ ఉన్న చిత్రాలను పోస్టు చేయడమే అందుకు కారణం. ఇది ఎక్కడివరకు వెళ్తుందో తెలీదు. నాకు ఆ దేశానికి వెళ్లాలని లేదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
భావ ప్రకటన స్వేచ్ఛతోపాటు వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయి. దీంతో యాప్ లోని చాలా కంటెంట్ను అణచివేయాల్సి వస్తోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు సైతం మమ్మల్ని జైల్లో పడేసేంత శక్తివంతంగా ఆ నిబంధనలు ఉంటాయి. విదేశాల్లో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలని భావిస్తున్నా” అని జుకర్బర్గ్ పేర్కొన్నారు. గత ఏడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల దృష్టా ఎక్స్, ఫేసుబుక్తో సహా పలు సామాజిక మాధ్యమాలపై పాకిస్థాన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు చేసింది.