నాగర్కర్నూల్: ఎస్ఎల్బిసి ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్ను కట్టింగ్ చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మనుషులు ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. 5-8 మీటర్ల మట్టి దిబ్బ కింద నలుగురి ఆనవాళ్లు స్కానింగ్లో కనిపించాయని.. మరో నలుగురు టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోందని స్ఫష్టం చేశారు. సహాయక చర్యల్లో మొత్తం 11 విభాగాల వాళ్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు.
పనులు వేగంగా జరగటం లేదని విమర్శిస్తున్నకొందరికి లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియదని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరంలో 200 కి.మి. సొరంగం తవ్వామని అంటున్న హరీశ్ రావు.. పదేళ్లలో ఎస్ఎస్బిసిలో 20 కి.మి.లు టన్నెల్ ఎందుకు తవ్వలేదు అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ ఘటన జరిగేది కాదేమో అని ఆయన అన్నారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందని తెలిపారు.