Tuesday, September 17, 2024

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల వర్తింపు 

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి: పేదరికం, సంక్షేమం అభివృద్ధిలో రాజకీయాలు లేవనీ, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తింప చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో 395మందికి రూ.3.95 కోట్ల విలువైన బిసి బంధు ప్రొసీడింగ్స్ 361మంది దివ్యాంగులకు పెంచిన పింఛన్ రూ.3016 నుండి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్‌ల మాదిరిగా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల వర్తింపచేస్తున్నామని అన్నారు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నదే తమ సిద్ధాంతమని అన్నారు. కుల వృత్తులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు.

సామాన్యులకు అండగా నిలవాలన్నది కెసిఆర్ ఆలోచననీ, వృత్తులు గతంలో మాదిరిగా వారికి ఉపాధి ఇవ్వడం లేదని, కావున వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచనఅని అన్నారు. దశలవారీగా అందరికీ రూ.లక్ష సాయం అందిస్తున్నమని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే విడలతవారీగా ప్రతి ఒక్కరికీ సాయం అందుతుందన్నారు. 395 మందికి బిసి బంధు కింద రూ.లక్ష చొప్పున తొలి విడత చెక్కులు అందజేశామని వెల్లడించారు. పని చేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ అదే లక్షంతో పని చేస్తున్నారనీ తెలిపారు. నేడు తెలంగాణ నుండి వలసలు ఆగిపోయాయని, ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారనీ అన్నారు. అన్నార్తులకు అండగా నిలవాలని ఆసరా పింఛన్లు ఇస్తున్నారన్నారు. దివ్యాంగులకు పింఛన్ రూ.4016 పెంచడం మూలంగా వనపర్తి నియోజకవర్గంలో 6551మందికి లబ్ధి చేకూరిందని అన్నారు.

రైతును నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఉచిత కరెంటు, రైతుబీమా, రైతుబంధు, సాగు నీళ్లు, ఇస్తూ పండించిన పంటలు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తున్నామని అన్నారు. వ్యవసాయం బాగుపడడంతో దాని చుట్టూ అల్లుకున్న రంగాలు నిలదొక్కుంటున్నాయన్నారు. వ్యవసాయ రంగం బలపడడంతో అనేక వ్యాపార రంగాలు నూతనంగా ఏర్పాటు అవుతున్నాయనీ అన్నారు. ఒక్క వనపర్తిలో వెయ్యికి పైగా బంగారు దుకాణాలు, 50 వరకు బిర్యానీ సెంటర్లు ఏర్పాటయ్యాయనీ అన్నారు. కార్ల షోరూంలు, బైక్ షో రూంలు, సూపర్ మార్కెట్ల రాకతో వేల మందికి కొత్తగా ఉపాధి లభిస్తున్నదన్నారు. ఒక నాడు పదెకరాల రైతు కూడా తిండికి తండ్లాడిన పరిస్థితి ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో ఆ దుస్థితి నుండి గట్టెక్కడం తెలంగాణ సాధించిన విజయమనీ అన్నారు. సమాజంలో వెనకబడ్డ వారికి కార్పోరేషన్ల ద్వారా చేయూతనందిస్తామన్నారు.

రాజకీయాలు, పైరవీలు, దళారులకు అతీతంగా సర్కారు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పని చేసిన ప్రభుత్వానికి ప్రజలు చేయూతనందించి అండగా నిలవాలని కోరారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ప్రజలకు అండగా ప్రభుత్వ పథకాలు దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు వంటి పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ రాజా వరప్రసాద్‌రావు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపిపిలు, జడ్పిటిసిలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపిటిసిలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News