Sunday, September 22, 2024

అయోధ్య రమ్మంటోంది..వెళితే ఏమవుతుందో?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిరం అచంచలమైన భక్తి విశ్వాసాలకు సంబంధించినది. అక్కడ రామ మందిరం లేనప్పటికీ శతావ్దాలుగా భక్తులలో రామ జన్మభూమి పట్ల ఏమాత్రం విశ్వాసం సడలలేదు. అయితే రాజకీయాలకు కూమా అక్కడ కొదవలేదు. ఆలయ విధ్వసం నుంచి రామ జన్మభూమిని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు రాజకీయ ఉద్యమాలే సాగాయి. కాగా..ఇప్పుడు ఆలయ ప్రతిఫ్టాత్మక మహోత్సవం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకులలో గందరగోళ పరిస్థితి నెలకొంటున్నది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎవరి దారి వారిదే అన్న చందంగా తయారవుతున్నది. అసలు గందరగోళం ఎందుకు? కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ మాటలు ప్రస్తుత రాజకీయ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి.

అక్కడకు వెళితే బిజెపి వలలో పడ్డావని అంటారు. వెళ్లకపోతే నువ్వు హిందూ వ్యతిరేకివని అంటారు..ఇవన్నీ పనికిమాలిన మాటలు అని థరూర్ గురువారం వ్యాఖ్యానించారు. 2024 జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోం 6,000 మంది ప్రముఖులకు రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పంపిస్తోంది. ఈ మహోత్సవానికి హాజరుకావడంపై భిన్న సిద్ధాంతాలతో కూడిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్య వైఖరికి రాలేకపోతోంది. అయోధ్యకు వీరు వెళ్లినా&వెళ్లకపోయినా రామ మందిర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన బిజెపికే అన్ని ప్రయోజనాలు దక్కడం ఖాయంగా కనపడుతోంది.
ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయలు
అయోధ్యలో 2024 జనవరి 22న జరిగే ఆలయ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవానికి ఆహ్వానాన్ని తిరస్కరించిన వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందున్నారు. అయోధ్య ఉత్సవానికి తాను హాజరుకవాడం లేదని ఆయన డిసెంబర్ 26న ప్రకటించారు. అందుకు కారణాన్ని కూడా ఆయన వివరించారు. మత విశ్వాసాలను రాజకీయం చేయడం వల్లే తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయన వెల్లడించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా మార్చివేశారని, ప్రధాని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఇతరులు ఈ కార్యక్రమంలో భౠగస్వాములయ్యారని ఏచూరి చెప్పారు. ఇది పచ్చిగా ప్రజల మత విశ్వాసాన్ని రాజకీయం చేయడమేనేని, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) కూడా సిపిఎం బాటలోనే నడిచే అవకాశం ఉంది.

రామాలయ ప్రారంభోత్సవానికి టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉందని టిఎంసి వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి, సిపిఎం సైద్ధాంతికంగా, రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. టిఎంసి తన నిర్ణయాన్ని టిఎంసి అధికారికంగా ప్రకటించనప్పటికీ మమతా బెనర్జీ సన్నిహిత వర్గాల కథనం ప్రకారం బిజెపి రాజకీయ వలలో చిక్కకూడదన్నది ఆమె అభిప్రాయంగా కనపడుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రచార అస్త్రంగా రామాలయాన్ని వాడుకోవాలని బిజెపి భావిస్తోందని నమ్మడం వల్లే అయోధ్య కార్యక్రమానికి దూరంగా ఉండాలన్నది టిఎంసి నిశ్చితాభిప్రాయమని వర్గాలు తెలిపాయి.

శివసేన వైఖరిలోనూ మార్పు
రామాలయ నిర్మాణం ద్వారా బిజెపి పొందనున్న రాజకీయ లబ్ధిపై శివసేన సైతం తన ఆగ్రహాన్ని బాహాటంగానే వ్యక్తం చేసింది. శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడ, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ నాయకులెవరూ జనవరి 22న అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ రాజకీయాలే. బిజెపి నిర్వహించే కార్యక్రమానికి ఎవరు హాజరవుతారు? ఇదేమీ జాతీయ కార్యక్రమం కాదు. ఇది బిజెపికి చెందిన కార్యక్రమం. ఇది బిజెపి బహిరంగ సభ..బిజెపి కార్యక్రమం పూర్తయిన తర్వాత మేము అయోధ్యను సందర్శిస్తాము అని సంజయ్ రౌత్ తెలిపారు.

ఇదిలా ఉంటే&అయోధ్యలో జనవరి 22న జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న వారందరూ తప్పనిసరిగా రావాలంటూ బిజెపినాయకుడు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభ్యర్థించారు. 450 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనున్నది. భారత్‌లోని అనేక తరాలకు చెందిన ప్రజల కల నెరవేరే తరుణం ఆసన్నమవుతోంది. ఆహ్వానం అందుకున్న వారందరూ తప్పకుండా అయోధ్యకు రావాలని అర్థిస్తున్నాను అని అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. అయోధ్యకు భక్తుల తాకిడి అప్పుడే మొదలైపోయిందని, భక్తులు ముందుగానే అక్కడి సమాచారాన్ని తెలుసుకుని అసౌకర్యానికి గురికాకుడా చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

వెళ్లాలా..వద్దా: దైలమాలో కాంగ్రెస్
ప్రతిపక్ష ఇండియా కూటమిలో అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ ఎదుర్కొంటున్నంత సంక్లిష్ట పరిస్థితి మరే ఇతర పార్టీ ఎదుర్కోవడం లేదనే చెప్పాలి. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేతులు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపినట్లు విశ్వ హిందూ పరిషద్(విహెచ్‌పి) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ డిసెంబర్ 21న వెల్లడించారు. అయితే వారం రోజులు గడిచిపోయినప్పటికీ తమ నాయకులు అయోధ్యకు వెళ్లడంపై కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన వెల్లడి కాలేదు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేకూర్చే ఎటువంటి వైఖరిని తీసుకోరాదని ఆ పార్టీ భావిస్తుండడం వల్లే నిర్ణయంలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ఎంతోకాలం వాయిదా వేయలేదు. అయితే కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సందిగ్ధావస్థపై కేరళలో ఆ పార్టీకి మిత్రపక్షమైన ఐయుఎంఎల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయోధ్యలో కార్యక్రమానికి వెళ్లకపోతే ఉత్తరాదిలో తన ఓట్లను ఎక్కడ కోల్పోవలసి వస్తుందోనని కాంగ్రెస్ భయపడుతున్నట్లు కనపడుతోందని ఐయుఎంఎల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా..బిజెపిని ఎదుర్కోవడానికి హిందూత్వ మెతక వైఖరిని అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అయోధ్యలో కార్యక్రమానికి గైర్హాజరైతే ఉత్తరాది రాష్ట్రాలలో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అర్థమవుతోంది. అదే సమయంలో ఆ కార్యక్రమానికి హాజరైతే బిజెపి వలలో పడినట్లు అవుతుంది. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సందిగ్ధ పరిస్థితిని కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ చర్కగా విశ్లేషించారు. వ్యక్తులుగానే ఆహ్వానాలు అందాయి. వెళ్లాలా వద్దా అన్నది వ్యక్తిగతంగానే ఎవరికివారు నిర్ణయించుకోవచ్చు. ఆలయాన్ని ఒక రాజకీయ వేదికగా నేను భావించను. ఒక రాజకీయ కార్యక్రమానికి హాజరుకానంత మాత్రాన హిందూ వ్యతిరేకిగా ఎవరిపైన ముద్ర పడదు అని శశి థరూర్ గురువారం అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమేమీ కాదు. థరూర్ అంటున్నట్లు ఇది కేవలం వ్యక్తిగత అంశంగానే పరిగణించలేము. రామ మందిర నిర్మాణం వెనుక ఒక రాజకీయ ఉద్యమం ఉంది. ఆ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలపై రాజకీయ ప్రభావం, వాటి పర్యవసానాలు తప్పనిసరిగా ఉంటాయన్నది నిస్సందేహం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News