భారత్, ఫ్రాన్స్ మధ్య రూ. 63 వేల కోట్లు విలువ చేసే రక్షణ ఒప్పందం
భారత నౌకాదళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు
స్వదేశీ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కార్యకలాపాలు
37 నుంచి 65 నెలల్లో విమానాల డెలివరీ పూర్తి
న్యూఢిల్లీ : భారత నౌకాదళ సామర్థాన్ని గణనీయంగా పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు రెండు దేశాల మధ్య సోమవారం మెగా ఒప్పందం కుదిరింది. రూ. 63 వేల కోట్లు విలువ చేసే ఈ ఒప్పందంపై రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఫ్రాన్స్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ కె స్వామినాథన్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వం మధ్య (జి2జి) కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్ఎం జెట్లు, నాలుగు ట్విన్ సీట్ శిక్షణ విమానాలు అందనున్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
కొన్ని రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఒప్పందంలో భాగంగా విమానాలతో పాటు కొన్ని రకాల ఆయుధాలు, సిమ్యులేటర్లు, సిబ్బందికి శిక్షణ, ఐదు సంవత్సరాల పాటు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ సహకారాన్ని కూడా ఫ్రాన్స్ అందజేయనున్నది. ఒప్పందం విలువలో ప్రాథమికంగా 15 శాతం మొత్తాన్ని భారత్ చెల్లించనున్నది. మొత్తం 26 విమానాల డెలివరీ ప్రక్రియ 37 నెలల నుంచి 65 నెలల మధ్య పూర్తి అవుతుందని, 2031 నాటికి అన్ని జెట్లు నౌకాదళానికి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలియజేశారు. సముద్ర లక్ష్యాలపై దాడులు, వాయు రక్షణ; నిఘా వంటి బహుళ ప్రయోజనకరమైన ఈ 4.5వ తరం రఫేల్ యుద్ధ విమానాలు అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్థాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఈ జెట్లలో 70 కిమీ పరిధి గల ఎక్సోసెట్ ఎఎం 39 యాంటీషిప్ క్షిపణులు, 300 కిమీ పైగా దూరంలోని లక్షాలను ఛేదించగల స్కాల్ప్ గగనతలం నుంచి భూమి పైకి ప్రయోగించే క్రూజ్ క్షిపణులు, 120150 కిమీ పరిధిలో శత్రు విమానాలను ఎదుర్కొనగల అత్యాధునిక మెటియోర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కూడా అమర్చనున్నారు.
2022లో నౌకాదళం నిర్వహించిన విస్తృత స్థాయి పరీక్షల్లో అమెరికాకు చెందిన ఎఫ్/ఎ18 సూపర్ హార్నెట్ కన్నా ఫ్రెంచ్ రఫేల్ఎమ్ మెరుగైన ప్రదర్శన కనబరచింది. ఇప్పటికే భారత వైమానిక దళం (ఐఎఎఫ్) 36 రఫేల్ జెట్లను వినియోగిస్తుండడంతో లాజిస్టిక్స్, విడిభాగాలు, నిర్వహణలో సౌలభ్యం కూడా రఫేల్ఎమ్ ఎంపికకు కలసివచ్చింది. ప్రస్తుతం నౌకాదళం వద్ద రష్యా నుంచి 2009 తరువాత కొనుగోలు చేసిన 45 మిగ్29కె యుద్ధ విమానాల్లో సుమారు 40 మాత్రమే ఉన్నాయి. అవి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహక నౌకల నుంచి పని చేస్తున్నాయి. అయితే, మిగ్29కె విమానాలు తరచు నిర్వహణ సమస్యలు, సేవల లభ్యత లోపాలతో ఇబ్బంది పడుతున్నాయి. మరొక వైపు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టిఇడిబిఎఫ్) పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరొక దశాబ్దం పట్టే అవకాశం ఉండడంతో, మధ్యంతర చర్యగా ఈ రఫేల్ఎమ్ జెట్లు కొనుగోలు చేయాలని నౌకాదళం నిర్ణయించింది. ఈ కొత్త విమానాల చేరికతో హిందు మహాసముద్రంలో భారత నౌకాదళ పటిష్ఠత మరింత పెరగనున్నది.