Thursday, September 19, 2024

అక్టోబర్ 6న పాక్‌తో భారత్ ఢీ

- Advertisement -
- Advertisement -

మహిళల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు
దుబాయి: మహిళల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా ఈ వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ టోర్నమెంట్ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ బంగ్లాలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో వేదికను యుఎఇకి మార్చారు. ఇక అక్టోబర్ 3 నుంచి 20 వరకు వరల్డ్‌కప్ జరుగనుంది. దుబాయితో పాటు షార్జాలు వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పోటీపడుతున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ టీమ్‌లకు చోటు కల్పించారు. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ అక్టోబర్ ఆరున తలపడుతుంది. ఈ మ్యాచ్ దుబాయిలో జరుగుతుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కొంటోంది. మరోవైపు అక్టోబర్ 17, 18న సెమీ ఫైనల్‌లు జరుగుతాయి. మరోవైపు ఫైనల్ సమరం అక్టోబర్ 20న జరుగుతుంది. మెగా టోర్నమెంట్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఒకటి వరకు వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. కాగా, అక్టోబర్ 3న బంగ్లాదేశ్‌స్కాట్లాండ్‌ల మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌నకు తెరలేస్తోంది.

ఈసారి కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు 8 సార్లు మహిళల టి20 వరల్డ్‌కప్ జరుగగా ఆస్ట్రేలియా ఏకంగా ఆరు సార్లు ఛాంపియన్‌గా నిలవడం విశేషం. భారత్ 2020లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లకు ట్రోఫీ సాధించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఆస్ట్రేలియానే మరోసారి ఛాంపియన్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ జట్లను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఎలాంటి జట్లను అయినా ఓడించే సత్తా వీటికి ఉంది. దీంతో ఈసారి కూడా వరల్డ్‌కప్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News