టారీఫ్ విధింపుల దశలో అత్యంత కీలకం
ట్రంప్ దెబ్బ నుంచి ఉపశమనానికి దారి
డీల్ ఖరారుకు అగర్వాల్ బృందం కసరత్తు
న్యూఢిల్లీ : భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఈ నెల 23వ తేదీ నుంచి జరుగుతాయి. ట్రంప్ భారీ స్థాయి సుంకాలు , ప్రపంచవ్యాప్త వాణిజ్య ప్రచ్ఛన్న పోరు దశలో ఇరుదేశాల మధ్య సంప్రదింపులు కీలక పరిణామం అయ్యాయి. ట్రంప్ 2 దశలో కూడా అమెరికా భారతదేశంతో పటిష్ట వాణిజ్య బంధానికి ఉత్సాహం చూపుతోంది. ఇప్పటికే అమెరికా ఈ దిశలో భారత్తో వాణిజ్య ఒప్పంద సంబంధిత నియమ నిబంధనలు ( టిఎంఆర్) ఖరారుకు సిద్ధం అవుతోంది. ం ఇందులో భాగంగా టారిఫ్లు, నాన్ టారీఫ్ విషయాలు, కస్టమ్స్ సరళీకృతం వంటి పలు అంశాలతో మొత్త 19 అధ్యాయాల ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇప్పటికే భారతీయ అధికార బృందం అక్కడికి వెళ్లనుంది. ట్రంప్ ఇటీవల తమ భారీ సుంకాల విధింపునకు 90 రోజుల విరామం ప్రకటించారు. ఈ గడువులోగానే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు యత్నిస్తున్నారు. ముందుగా ప్రస్తుత పరిస్థితులలో ఇరు పక్షాల మధ్య అభిప్రాయ బేడాలను తొలిగించుకోవడం జరుగుతుంది. తరువాత అధికారికంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ)కు రంగం సిద్ధం చేసుకుంటారు.
ట్రంప్ వైఖరిని బట్టి, భారత్తో ఆయనకు ఇంతకు ముందటి సత్సంబంధాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సరికొత్త వాణిజ్యపరమైన డీల్కు అన్ని అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. భారతదేశం తరఫున వాణిజ్య శాఖలో అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రధాన దూతగా వ్యవహరిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే భారత బృందం ముఖాముఖి చర్చలు జరుపుతుంది. ఇటీవలే ఆయనను వాణిజ్య శాఖ కార్యదర్శిగా నియమించారు. అక్టోబర్ 1 నుంచి ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇరు దేశాల మధ్య మూడురోజుల పాటు సంప్రదింపులు జరుగుతాయి.