పాకిస్థాన్ కరాచీలోని మలిర్ జైలులో 52 ఏళ్ల భారత మత్సకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు గురువారం తెలిపారు. ‘భారతీయ ఖైదీలు ఉండే బ్యారక్లోని వాష్రూమ్లో మంగళవారం రాత్రి గౌరవ్ రామ్ ఆనంద్ ఓ తాడుతో ఉరివేసుకున్నాడు’ అని జైలు సూపరింటెండెంట్ అర్షద్ హుసైన్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. అతడు మంగళవారం రాత్రి 2.30 గంటలకు చనిపోయినట్లు కారాగార డాక్టర్లు ప్రకటించారని జైల్ సూపరింటెండెంట్ వివరించారు.
కాగా అతడి భౌతిక కాయాన్ని ఈది ట్రస్ట్ మార్చురీకి తరలించినట్లు, మిగతా ఫార్మాలిటీస్ జరుగుతున్నాయని అర్షద్ తెలిపారు. పాకిస్థాన్ జలాల్లో చేపలు పడుతున్నందుకు 2022 ఫిబ్రవరిలో పట్టుకున్నారు. అప్పటి నుంచి అతడు పాక్ జైలులోనే మగ్గుతున్నాడు. పాకిస్థాన్ జైలుల్లో మగ్గుతున్న చాలా మంది భారతీయ మత్సకారుల్లో ఎక్కువ వరకు గుజరాత్లోని గిర్ సోమనాథ్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని అర్షద్ హైసైన్ వివరించారు. పాకిస్థాన్లో మగ్గుతున్న చాలా మంది భారతీయులు మనోవ్యధ, ఆదుర్దాతో ఉన్నారని ఈది ఫౌండేషన్కు చెందిన అధికారి ఒకరు తెలిపారు.