ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది పాకిస్థాన్ వేదికగా జరుగనుంది. అయితే పాకిస్థాన్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే.. తాము పాకిస్థాన్కు వెళ్లేది లేదని భారత జట్టు తేల్చి చెప్పేసింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్లు అన్ని దుబాయ్ వేదికగా నిర్వహిస్తామని ఐసీసీ ప్రకటించింది. కాగా, ఈ టోర్నమెంట్కి ముందే భారత్కు తీవ్ర అవమానం ఎదురైంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి మరో రెండు రోజులే ఉన్న తరుణంలో కరాచీ స్టేడియంలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఈ స్టేడియంలో అన్ని దేశాల జాతీయ పతకాలు ప్రదర్శించగా.. అందులో భారత పతాకం మాత్రం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచులు జరుగనున్నాయి. అయితే టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జాతీయ పతాకాలు ప్రదర్శించాల్సిన చోట.. భారత జెండా లేకపోవడం విమర్శలకు దారి తీసింది. అసలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో కారణాలు తెలియలేదు. కానీ, ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు మాత్రం పిసిబిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని మండిపడుతున్నారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుండగా.. ఫిబ్రవరి 23న దాయాదులు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది.