దేశంలో ఒక్కరోజే 45,720 కేసులు, 1,129 మరణాలు
30 వేలకు చేరువలో మరణాలు, 1.5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
రెండో రోజూ 29 వేలకు పైగా రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అందరూ ఊహించినట్లుగానే వర్షాకాలం మొదలైనప్పటినుంచి ఉగ్రరూపం దాలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి నిత్యం దాదాపు 40 వేల కేసులు నమోదవుతుండగా తాజాగా గడచిన 24 గంటల్లో ఏకంగా 45,720 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్త కేసుల సంఖ్య 12లక్షలను దాటి12,38,635కు చేరుకుంది. కొవిడ్ మరణాలు కూడా రికార్డు సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 685 మంది మృత్యువాత పడ్డారు. అయితే తమిళనాడులో కరోనా సోకి మరణించిన వారి సంఖ్యను ఆ రాష్ట్రప్రభుత్వం సవరించింది. దీంతో అదనంగా మరో 444 మరణాలు వచ్చి చేరాయి. దీంతో నిన్న ఒక్క రోజే దేశంలో 1,129 మరణాలు నమోదైనాయి. ఒకే రోజులో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో గురువారం నాటికి కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 29,861కి చేరుకుంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య11 లక్షలనుంచి 12 లక్షలను మించి పోవడం గమనార్హం. కాగా ఇప్పటివరకు కరోనా బాధితుల్లో 7,82,606 మంది కోలుకుని ఇళ్లకు చేరుకోగా, 4,26,167 మంది చికిత్స పొందుతున్నారు. కాగా రికవరీ రేటు 63.18 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.4 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, బుధవారం నమోదైన 45,720 కేసుల్లో 75 శాతం మహారాష్ట్ర(10,576), తమిళనాడు(5,849), కర్నాటక (4,764), యుపి(2,300), పశ్చిమ బెంగాల్(2,291), తెలంగాణ(1,554), బీహార్(1,417), అసోం(1,390), ఢిల్లీ(1,227), ఒడిశా(1,078), కేరళ(1,038), గుజరాత్(1,020) రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. కాగా తాజాగా నమోదైన 1,129 మరణాల్లో తమిళనాడులో 518, మహారాష్ట్రలో 280, ఆంధ్రప్రదేశ్లో 65, కర్నాటకలో 55, పశ్చిమ బెంగాల్(35), యుపి(34), ఢిల్లీ (29),గుజరాత్ (28)లలో నమోదైనాయి.ఇదిలా ఉండగా దేశంలో కొవిడ్ నిర్ధారణ కోసం జరిపిన పరీక్షల సంఖ్య 1.5 కోట్లను దాటింది. ఇప్పటివరకు 1,50,75,369 శాంపిల్స్ను పరీక్షించగా, నిన్న ఒక్క రోజే 3,50,823 శాంపిల్స్ను పరీక్షించినట్లు భారత శాస్త్ర పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది. తాజామరణాలతో ప్రపంచంలో అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ ఆరోస్థానానికి చేరువైంది. ఇప్పటివరకు 30 వేల మరణాలతో ఫ్రాన్స్ ఆరో స్థానంలో ఉంది, కాగా కేసలు విషయంలో మాత్రం మన దేశం మూడో స్థానంలో కొనసాగుతోంది.
రెండో రోజూ 29 వేలకు పైగా కోలుకున్నారు
కాగా దేశంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగున్నా వైరస్ బారినపడిన వారు సైతం అదే స్థాయిలో కోలుకుంటున్నారు. దేశంలో వరసగా రెండో రోజు కూడా గడచిన 24 గంటల్లో 29,557 మంది కరోనా బారినుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు గురువారం తెలిపాయి.
India’s Covid 19 total Cases Cross 12 lakhs