Sunday, April 13, 2025

ఆ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి: మాజీ మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని  మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రుణమాఫీ కాలేదు రైతుబంధు పడలేదనే బాధలో ఉన్నారని, అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంటల భీమా తెస్తామని, రైతు బంధు 15000 ఇస్తామని 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారని, ఇప్పటివరకు చేయలేదని ధ్వజమెత్తారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం రాజ్ గోపాల్ పేట్ గ్రామం లో ఇటీవల కురిసిన అకాల, వడ గండ్ల వర్షాలకు నష్ట పోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి బాలమ్మలకు మూడెకరాల పొలం ఉందని, రెండు లక్షల పైనున్న రుణాన్ని అప్పు తెచ్చి కట్టామని ఇంకా రుణమాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 10000 వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేశామన్నారు.

వానకాలం రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని, యాసంగి సగం మందికి వేసామన్నారని, ఆ సగం మందికి కూడా పూర్తిగా రైతుబంధు రాలేదన్నారు. ఆనాడు కెసిఆర్ ఉన్నప్పుడు అందరికీ రైతుబంధు డబ్బులు పడ్డాయని, ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లలో అద్దెకరం, పావు ఎకరం ఎక్కువ ఉందనే సాకుతో రైతులకు రైతుబంధు ఆపారని దుయ్యబట్టారు.  9,000 కోట్ల రూపాయలు రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే నాలుగు వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇంకా 5000 కోట్లు రైతుబంధు కోతపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానకాలం 9000 కోట్లు, యాసంగీ 5వేల కోట్లు మొత్తం 14 వేల కోట్లు ప్రభుత్వం రైతులకు ఎగనామం పెట్టిందని విమర్శలు గుప్పించారు. 14 వేల కోట్లు రైతుబంధు ఎగ్గొట్టి వాటిని రుణమాఫీలో ఇచ్చినట్టు చూపిస్తున్నారని, కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు కెసిఆర్ ఆపలేదని గుర్తు చేశారు. పంట బీమాకు సంబంధించి బడ్జెట్ లో డబ్బులు పెట్టి ఒక్క రైతుకు కూడా ఎందుకు ఇవ్వడంలేదని హరీష్ రావు ప్రశ్నించారు.

వంట నష్టపరిహారం ఎకరానికి 6,000 ఉంటే కెసిఆర్ పదివేలకు పెంచారన్నారు. పోయిన ఎండాకాలం సిద్దిపేట జిల్లాలో 1,350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందని, 1350 ఎకరాలకు ఇప్పటివరకు పంట నష్టం ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదని,  తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని వారి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఆరుగాలం కష్టం చేసిన రైతులకు నోటికాడి బుక్క కొట్టినట్టు అయిందని బాధను వ్యక్తం చేశారు. నంగునూరు మండలంలో 11 గ్రామాల్లో దాదాపు 5,300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించామని, ఒక సిద్దిపేట జిల్లాలోనే 10000 వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారని, 2500 ఎకరాల హార్టికల్చర్ పంటలు కూడా నష్టపోయాయని హరీష్ రావు వివరించారు.

ఇన్ పుట్ సబ్సిడీతోపాటు యాసంగి రైతుబంధు కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, కెసిఆర్ పాలనలో అనేక విత్తనాలు సబ్సిడీ కింద ఇచ్చామని కందులు, పెసర్లు, వరి లాంటి విత్తనాలను సబ్సిడీ కింద ప్రభుత్వం అందించామని, ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలను అందుబాటులో పెట్టి రైతులకు సకాలంలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు బీమా విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, చాలామంది చనిపోయిన రైతులకు రైతు బీమా అందడం లేదని, వెంటనే చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా డబ్బులను విడుదల చేయాలని,  పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీతో పాటు వచ్చే వానకాలానికి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు.  కౌలు రైతుల గురించి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, కౌలు రైతుకు రైతుబంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, ఇటు రైతు బంధు రాక ఇన్ పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని చురకలంటించారు. తక్షణమే వడగండ్ల వానకు పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News