Monday, September 9, 2024

మహిళలకు త్వరలో వడ్డీ లేని రుణాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు లక్షల్లోనే వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. రాష్ట్రంలో ఉన్న మహిళలకు రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మహిళా సంఘాల ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ రూ.20 వేల కోట్ల వడ్డీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు, ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని మంజూరు, ప్రభుత్వ పరంగా అందించే చేయూత, బ్యాంకర్లతో లింకేజీ తదితర అంశాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విధి విధానాలు, మార్గదర్శకాలు, నిబంధనలు ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని తెలిసింది.

ఆరు గ్యారంటీల్లో అధికంగా మహిళలను ఆకర్షించే ఈ వడ్డీ లేని రుణాల హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అక్కాచెల్లెమ్మలకు పెద్ద పీట వేస్తూ మహిళా ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, యవతులు, విద్యార్థినులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అలాగే గృహ జ్యోతి పథకాన్ని అమలు చేసింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగిస్తే బిల్లు కట్టనవసరం లేని పథకాన్ని కొనసాగిస్తోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. తాజాగా కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. సున్న వడ్డీతో మహిళలకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా ప్రతి సభ్యురాలికి వ్యక్తిగత జీవిత భీమాను కూడా అమలు చేయనుంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించనున్నారు. గ్రామాల్లో మహిళా వ్యాపార వేత్తలను తయారు చేయాలన్న ఉద్దేశంతో సున్న వడ్డీ రుణాలను అందించేందుకు సంకల్పించింది. దీని కోసం ప్రతి నియోజవర్గం పరిధిలో ప్రత్యేక మినీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను ఆయా కలెక్టర్ల ద్వారా రూపొందిస్తున్నారు. తెలంగాణ మహిళా శక్తి భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ పథకంలో మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుని సకాలంలో చెల్లిస్తే, వారు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

2019.-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీలపై రాయితీ ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. గతంలో బకాయి ఉన్న నిధులను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీయంబర్స్‌మెంట్ చేస్తుంది. వీటితోపాటు మహిళా సంఘాలకు మరికొన్ని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది. ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలోని సంఘాలకు రూ.కోటి వరకు రుణాలు మంజురు చేస్తారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 5 వేల గ్రామాలకు రూ.5 వేల కోట్ల వరకు రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వీటి ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు.

వీటి ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఇలా డ్వాక్రా సంఘాల మహిళలందరికీ ఉపాధితో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊతమిస్తుంది. సకాలంలో వడ్డీలు చెల్లించిన వారికి మహిళా సంఘాలకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. స్థానిక మహిళలు, తెల్లరేషన్ కార్డు కలిగిన వారే ఈ బుణాలకు అర్హులని తెలుస్తోంది. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తుందని అధికార వర్గాల సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News