అమెరికా సహా అనేక దేశాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ డీలర్ను పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. ఎఫ్బీఐ మోస్ట్వాంటెడ్ జాబితాలో ఉన్న ఇంటర్నేషనల్ డ్రగ్ లార్డ్ షెమనాజ్ సింగ్ అలియాస్ షాన్ భిందర్ను అరెస్టు చేసినట్టు పంజాబ్ డీజీపీ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. నార్కోటిక్స్ సిండికేట్లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడని , కొలంబియా నుంచి అమెరికా, కెనడా లోకి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామని తెలియజేశారు. షెహనాజ్ అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అమెరికా ఎఫ్బీఐ ఫిబ్రవరి 26న అతడి అనుచరులను అరెస్ట్ చేసింది.
వారి నుంచి 391 కేజీల మెథంఫెటమైన్ , 109 కేజీల కొకైన్ సహా నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలతో షెహనాజ్ భారత్కు పారిపోయి వచ్చాడు. దానిపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పంజాబ్ తర్న్ తరణ్ పోలీసులు రహస్య ఆపరేషన్ చేపట్టారు. అతడి జాడను గుర్తించి తాజాగా అరెస్టు చేసినట్టు డీజీపీ వెల్లడించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా , వ్యవస్థీకృత నేరాల కట్టడికి తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేందుకు ఆ ఆపరేషన్ నిదర్శనమని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. డ్రగ్ స్మగ్లర్లు, క్రిమినల్స్కు పంజాబ్ స్వర్గదామం కాదని హెచ్చరించారు.