Sunday, September 22, 2024

ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు..32 మంది కార్మికులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఇరాన్‌లోని ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. దీనితో గని లోపల పని చేస్తున్న కార్మికుల్లో 32 మంది మరణించారు. మరి 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలిసి హుటాహుటిని అక్కడికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులైన కార్మికులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బొగ్గు గనిలో 700 మీటర్ల లోతున సొరంగాల్లో కార్మికులు పని చేస్తుండగా, అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని సమాచారం, మీథేన్ గ్యాస్ లీక్ కావడమే పేలుడుకు దారి తీసిందని క్షతగాత్రులైన కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో 70 మంది కార్మికులు పని చేస్తున్నారని అధికారులు తెలియజేశారు.

మరి 18 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, లోపల చిక్కుకున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువస్తామని అధికారులు తెలియజేశారు. ప్రమాదం జరిగిన బొగ్గు గని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సుమారు 540 కిలో మీటర్ల దూరంలోని తబాస్‌లో ఉంది. కాగా, ఇరాన్‌లో గతంలోను బొగ్గు గని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2017లో ఒక బొగ్గు గనిలో జరిగిన పేలుడుకు 42 మంది కార్మికులు బలయ్యారు. 2013లో రెండు గనుల్లో జరిగిన ప్రమాదాల్లో 11 మంది, 2009లో మరొక ప్రమాదంలో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గనుల ప్రాంతాల్లో భద్రత ప్రమాణాలు, తగినన్ని అత్యవసర సర్వీసులు లేకపోవడం ఈ ప్రమాదాల్లో మరణాలకు దారి తీస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News