Wednesday, September 18, 2024

ఐటిడిఎల రూపశిల్పి భీమ్ రావ్

- Advertisement -
- Advertisement -

నాటి ఆంధ్ర ప్రదేశ్, నేటి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి వనరులు, జంతుజాలం, దట్టమైన అరణ్యాలతో కూడిన ఆదివాసుల జిల్లాగా పేరొందినది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నేటి కు మరంభీం ఆసిఫాబాద్ నాటి గోండ్వానా రాజ్యంలో భాగం. అప్పటి నుం చి నేటివరకు ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మారుతున్నప్పటి కీ… ఆదివాసీల జీవన శైలిలో సరైన మార్పు రాలేదు. ఆదివాసులు తమ అస్తిత్వం కోసం, స్వయం పాలన కోసం పోరాటమే జీవితంగా మారుతు న్న సందర్భంలో… ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిమ జాతి సంక్షేమం గురించి పరితపించిన రాజకీయ నేతలలో కోట్నాక భీమ్ రావ్ తొలి తరం నాయకుడు.

నిస్వార్ధ సేవాపరుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజనులలో తొలి ఆదివాసీ మంత్రి కూడా ఆయనే. గిరిజన గోండు తెగకు చెం దిన కొట్నాక భీమ్ రావ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంబార గూడెంలో కోట్నాక జంగు మొకాసి, జాదుబాయి దంపతులకు రెండవ సంతానంగా 1933, నవంబర్19 న జన్మించారు. నలభై ఏళ్ళ తన రాజకీయ జీవితాన్ని పేదలు, బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అంకితం చేసిన నిస్వార్ధ సేవాపరాయణుడు ఆయన.

భీమ్ రావ్ 1972 నుండి 1976 వరకు మరియు 1989 నుండి 1993 కాలంలో రెండు సార్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలోనే అనేకమంది నిరుపేద ఆదివాసుల సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ఆయన ఆదర్శమూర్తిగా కీర్తి కెక్కారు. స్వాతంత్య్రం సిద్ధించిన మలి రోజుల్లో అనగా 1948 నుంచి 1956 మధ్య బి.ఏ, ఎల్. ఎల్. బి చదివిన భీంరావ్ గోండు గిరిజనులలో ప్రధమ పట్టభద్రుడుగా రికార్డు సృష్టించారు. అదే తెగకు చెందిన ఏకైక ఐ. ఏ. ఎస్ దివంగత మడవి తుకారాం కంటే పూర్వమే అంటే 1957 లో గ్రూప్-1 పరీక్షలలో ఉత్తీర్ణుడైన తొలి ఆదివాసీ విద్యావంతుడు. ఆయన ఉద్యోగాన్వేషణను విరమించుకొని ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో, ఒక ఆశయంతో తన జీవిత గమ్యాన్ని రాజకీయదిశగా మార్చుకొని నిస్వార్థ రాజకీయనేతగా పేరు గడించారు.

1952లో మొదటిసారిగా ఆదివాసీ తెగల నుండి విశాఖ జిల్లా పాడేరు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన గాం మల్లుదొర పార్లమెంటులో అరంగేట్రం చేయగా, 1962 లో ఆసిఫాబాద్ అసెం బ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోట్నాక భీమ్రావ్ రాష్ట్ర శాసనసభలోకి అడుగుబెట్టిన తొలి ఆదివాసీ శాసన సభ్యుడు కావడం విశేషం. అప్పటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు గారి మంత్రివర్గంలో అంటే 1972లో గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఆవిర్భవించింది. దీనితో భీమ్ రావ్‌కి తొలిసారిగా గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయన్ని వరించింది.

1989లో ఖా నాపూర్ శాసనసభ్యునిగా రెండోసారి గెలిచిన తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో, 1990లో నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి ప్రభు త్వ హయాం లో ఒకసారి, 1992 – 1993 మధ్య కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రభుత్వం లో గిరిజన సంక్షేమ శాఖామాత్యులుగా పని చేయడం అంటే మొత్తంగా ముగ్గురు ముఖ్య మంత్రుల వద్ద పనిచేయడం భీమ్ రావ్ ప్రతిభకు, సేవాగుణానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలోని గిరిజన భూభాగానికి చెందిన గోండు, కోలాం, కోయ, పరధాను, మన్నేవార్లు, తోటి, నాయకపోడు మొదలైన గిరిజన తెగల వారికి అభివృద్ధి ఫలాలు అందిపుచ్చుకోవడానికి అవసరమైన బృహత్తర కార్యక్రమాలకు భీమ్ రావ్ ఆ కాలంలోనే శ్రీకారం చుట్టారు. 197476 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో రా జ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం – ఆదిమ గిరిజనులు నివసించే 5,948 షెడ్యూల్ ఏజెన్సీ గ్రామాల పరిధిలోని తొమ్మిది సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిటిఏలు) ఏర్పాటుకు కృషి చేసిన కోట్నాక భీమ్ రావ్ ’ఐటిడిఏల రూపశిల్పి’ అనడంలో అతిశయోక్తి లేదు.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోట్నాక భీమ్ రావ్ గారి ఆనాటి కృషి వల్ల – మొత్తం 9 ఐటిడిఏలు ఏర్పడ్డాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటూరునాగారం, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా లో పార్వతీపురం, తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, పశ్చిమగోదావరి జిల్లాలోని కోటరామచంద్రపురం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వంటి ప్రాంతాలలో ప్ర స్తుతం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు పని చేస్తున్నాయి. వీటితో గిరిజనులలో అక్షరాస్యత పెంచి, వారిని చైతన్యవంతులను చేసేందుకు 1975 -1976 మధ్య కాలంలో ఐటిడిఏల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను, తదుపరి గిరిజన వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడంలో భీంరావ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మౌళిక వసతుల కల్పనలో భాగంగా అనేక ఆదివాసీ గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, పారిశుధ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణాల పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచారు.

కోట్నాక భీమ్ రావు భారీ, బంబార జాగీరు అయినందున గోండ్వానా రాజ్యం నుండి దేశానికి స్వా తంత్య్రం సిద్ధించిన తదుపరి గోండుల పోరాటాలు, వారి సాంస్కృతిక చరిత్రను పరిశోధించిన అధ్యయన శీలి. 1940, అక్టోబర్ 8న నిజాం మూకల దాడిలో అమరుడైన ఆదివాసీల ఆశాజ్యోతి, తెలంగాణ పోరాట యోధుడు కు మ్రంభీం చరిత్రను తొలిసారిగా రచయిత ’సామల సదాశివ్’ చేత లోకానికి పరిచయం చేసిన ఘనత వారికే దక్కుతుంది. ఆ తర్వాత కుమరం భీమ్ చరిత్రను అల్లం రాజయ్య, సాహూ, దేశ్ పాండేలు నవలలుగా ర చించారు. ఒక మంత్రి పదవిలో ఉండి కూడా గోండు గిరిజనుల పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలను ఆరాధించిన భీమ్ రావ్ ఆదివాసీల ఆత్మబంధువు. మా రుతున్న సమాజంలో వచ్చే కొత్త మార్పులను, కు టుంబ తగాదాలను స్వయంగా పరిష్కరించుకొనేందుకు ప్రొఫెసర్ హై మండార్ఫ్ – ఎలిజబెత్ దంపతుల ఆధ్వర్యంలో గోండ్వానా రాయ్ సెంటర్, రాజ్ గోండ్ సేవా సమితి, అవ్వల్ కమిటీలను ఏర్పాటు చేశారు. నిజాం పాలనలో ’ఖాదీ అభ్యాం’ అనే సోషల్ సర్వీస్ ’సోషల్ వెల్ఫేర్’ గా ఉండేది. దీని నుండి ప్రత్యేకంగా’ ట్రైబర్ వెల్ఫేర్’ అంటే గిరిజన సంక్షేమశాఖగా అవతరించేందుకు తనవంతు కృషి చేశారు భీమ్ రావ్.
ఆదివాసీల సంక్షేమం కోసం గిరిజన సంక్షేమశాఖ మంత్రిగానే కాకుం డా నిరంతరం సేవా దృక్పధంతో పలు కార్యక్రమాలు చేసిన భీమ్ రావ్ 2002, ఆగష్టు 29న తనువు చాలించా రు. ఉట్నూరులోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన భీమ్ రావ్ స్మారక స్థూపం వద్ద ప్రతి ఏటా ఆగష్టు 29 న ఆదివాసులు సంప్రదాయ బద్దంగా నివాళులు అర్పిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి ప్రతినిధి సిడాం అర్జు, ప్రస్తుత ఎమ్మెల్యే కోవలక్ష్మీ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ‘ భీం రావు స్మారక సంక్షేమ సంఘం ‘ ఆయన స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గిరిజన సంక్షేమశాఖ, ఐటిడిఏల రూపకల్పనకు భీమ్ రావ్ చేసిన కృషి అనన్యమైనది. ఆదివాసీల ఆత్మబంధువుగా ముద్రపడిన భీమ్ రావ్ గారి జయంతి రోజు నవంబర్ 19ని ఐటిడిఏల స్థాపక దినోత్సవంగా గుర్తించి, అన్ని ఐటిడిఏల ప్రాంగణాలలో భీమ్ రావ్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఐటిడిఏ స్థాపకోత్సవాలు నిర్వహిస్తే సమంజసంగా ఉంటుంది.

గుమ్మడి లక్ష్మీనారాయణ
78933 03516

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News