ఉగ్ర నిధుల కేసులో అరెస్టయిన జమ్మూ కాశ్మీర్ బారాముల్లా ఎంపి అబ్దుల్ రషీద్ షేఖ్ అలియాస్ ఇంజనీర్ రషీద్ ‘కస్టడీలో’ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రషీద్ విమాన ప్రయాణం ముప్పు అన్న ఎన్ఐఎ భయాందోళనను హైకోర్టు తిరస్కరించింది. బుధవారం (26), ఏప్రిల్ 4 మధ్య లోక్సభ సమావేశం రోజుల్లో జైలు నుంచి పార్లమెంట్కు మఫ్టీ దుస్తుల్లోని పోలీస్ సిబ్బంది కాపలాతో రషీద్ను పంపాలని డైరెక్టర్ జనరల్ (జైళ్లు)ను న్యాయమూర్తులు చంద్ర ధారి సింగ్, అనూప్ జైరామ్ భంభానితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఎంపి రషీద్ను పార్లమెంట్ భద్రత సిబ్బంది లేదా మార్షల్స్ కస్టడీకి అప్పగించాలని, వారు సభ కార్యక్రమాలకు హాజరు కావడానికి,
అక్కడ ఇతర సౌకర్యాలు పొందడానికి ఆయనను వారు అనుమతించాలని బెంచ్ సూచించింది. ‘పార్లమెంట్ సెషన్కు హాజరవుతున్నప్పుడు అప్పిలెంట్ (రషీద్)కు ఎటువంటి సెల్యూలార్ లేదా ల్యాండ్లైన్ ఫోన్ను లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగించుకునేందుకు అర్హత లేదు, ఏ విధమైన ఇంటర్నెట్కు అందుబాటులో ఉండరాదు’ అని బెంచ్ మంగళవారం నాటి ఉత్తర్వులో స్పష్టం చేసింది. పార్లమెంట్ ఆవరణలో మినహా జైలు వెలుపల ఉన్న ఎవరితోను మాట్లాడరాదని రషీద్ను బెంచ్ ఆదేశించింది. రషీద్కు సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరన్; న్యాయవాది విఖ్యాత్ ఒబెరాయ్ ప్రాతినిధ్యం వహించారు. రషీద్ పెండింగ్లో ఉన్న తన కేసుతో సహా ఏవిషయంపైనైనా మీడియాతో మాట్లాడరాదని కూడా బెంచ్ ఆదేశించింది.