శాసనసభ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీష్రెడ్డి ఆరోపించారు. పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదని అన్నారు. ఈనెల 27 వరకు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా స్పీకర్ ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయినా సోమవారం జగదీష్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అయితే సభ లోపలికి వెళ్లకుండా చీఫ్ మార్షల్ అడ్డుకోగా, తన సస్పెన్షన్పై ఇంతవరకు ఎలాంటి బులెటిన్ ఇవ్వలేదని, అలాంటప్పుడు సస్పెండ్ చేశారనడానికి ఆధారాలు ఏమున్నాయని జగదీష్రెడ్డి ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇప్పటివరకు తన సస్పెండ్పై బులెటిన్ ఇవ్వలేదని,బులెటిన్ ఇస్తే తాను రాను అని.. లేదంటే సభాపతిని కలుస్తానని పేర్కొన్నారు. తనను అసెంబ్లీకి రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఏ కారణంతో సస్పెండ్ చేశారో ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదని చెప్పారు.
సస్పెండ్ చేశారో లేదో కనీసం ఆధారాలు లేవు అని చెప్పారు. తాను కోర్టుకు వెళ్తానన్న భయంతో బులెటిన్ ఇవ్వట్లేదు అని పేర్కొన్నారు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మంత్రులు జవాబివ్వలేక ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా మంత్రులు దావత్లకు కూడా ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారని విమర్శించారు. ఒక గంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై శాసనసభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదని ఆరోపించారు. పవర్ ప్లాంట్లో రాత్రి 10.15 గంటలకు ప్రమాదం జరిగితే.. తానే ముందు చేరుకున్నానని చెప్పారు. తాము చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతోపాటు వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వలన చనిపోయిన వారి కుటుంబాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయని జగదీష్రెడ్డి మండిపడ్డారు.
జగదీష్రెడ్డితో కలిసి స్పీకర్తో బిఆర్ఎస్ ఎంఎల్ఎల భేటీ
తన సస్పెన్షన్కు సంబంధించి అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఎంఎల్ఎ జగదీష్రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు బిఆర్ఎస్ ఎంఎల్ఎలు కెటిఆర్, హరీష్రావు, ఇతర సభ్యలుతో కలిసి సోమవారం ఆయన స్పీకర్ను కలిశారు. ఇంకా అధికారిక బులెటిన్ను విడుదల చేయకపోవడంపై జగదీష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను అన్యాయంగా ఏక పక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వారం రోజులుగా బులెటిన్ గురించి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తన సస్పెన్షన్పై బులెటిన్ విడుదల చేయడంతో పాటు అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టాలని జగదీష్రెడ్డి వినతి పత్రంలో కోరారు.