మనతెలంగాణ/హైదరాబాద్ : ఏప్రిల్ 2 నుంచి జరగనున్న జెఇఇ మెయిన్ సెషన్- 2 పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) ఏర్పాట్లు చేస్తోంది.అందులో భాగంగా గురువారం అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ -1 (బిఇ/బి.టెక్), ఏప్రిల్ 9న పేపర్ -2 (బి.ఆర్క్/బి.ప్లానింగ్) పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. జెఇఇ మెయిన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏ తేదీ పరీక్ష ఉంటుంది..
ఏ సిటీలో పరీక్ష కేంద్రం ఉంటుందనే వివరాలను అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల్లో పేర్కొంటారు. వీటిని డౌన్లోడ్ చేసుకొనేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్/పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది అడ్మిట్ కార్డు కాదని మాత్రం విద్యార్థులు గమనించాలని ఎన్టిఎ స్పష్టం చేసింది. ఎగ్జామినేషన్ సెంటర్ ఏ నగరంలో వచ్చిందో ముందుగా తెలుసుకొనేందుకు వీలుగా ఈ స్లిప్పులను విడుదల చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. జెఇఇ మెయిన్ సెషన్ 2 పరీక్ష అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.