జెఇఇ మెయిన్ సెషన్ 2 ఫైనల్ ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ మేరకు ఫైనల్ ‘కీ’ని https://jeemain.nta.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) ప్రకటించింది. రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్టీఏ నిర్వహించిన సంగతి తెలిసిందే. గత జనవరి, ఇటీవల జరిగిన రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. అయితే జెఇఇ -మెయిన్ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండడంపై ఇటీవల స్పందించిన ఎన్టిఎ.. ఫైనల్ ‘కీ’ వచ్చేవరకు విద్యార్థులు వేచి చూడాలని సూచించింది.
తుది ‘కీ’ మాత్రమే స్కోరును నిర్ణయిస్తుందని, ప్రాథమిక కీ ఆధారంగా విద్యార్థులు ఓ నిర్ణయానికి రాకూడదని తెలిపింది. జెఇఇ మెయిన్లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జెఇఇ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. జెఇఇ మెయిన్ ర్యాంకులతో ఎన్ఐటిలు, అడ్వాన్స్డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందవచ్చు. దేశంలోని 31 ఎన్ఐటిల్లో గత ఏడాది సుమారు 24 వేలు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్ ఐటీల్లో దాదాపు 8,500, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు ఉన్నాయి. ఒకవేళ విద్యార్థులు ఐఐటీల్లో చేరాలనుకుంటే మే 18న జరిగే జెఇఇ అడ్వాన్స్డ్ రాయాల్సి ఉంటుంది.