హెచ్యుజె ప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్యుజే టిడబ్లుజెఎఫ్) నాయకులు మంత్రి కొండా సురేఖను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా 2025 మీడియా డైరీని మంత్రికి అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను హెచ్యుజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల కొత్తగా ఇస్తున్న హెల్త్ కార్డులతో కలిపి జర్నలిస్టులకు హెల్తు కార్డులు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ప్రతి జర్నలిస్టుకు ప్రతి ఏటా రూ.10 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. రైతు బీమా మాదిరి అక్రిడేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బీమా అమలు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏదేని కారణంతో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబాలకు కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అందేలా జీవిత బీమా పథకం తీసుకురావాలని తెలిపారు.
ఈ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ ఇన్చార్జి మంత్రి అయిన ఐఅండ్ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తానని చెప్పారు. ఇండ్ల స్థలాల సమస్య విషయంలో సీఎం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్యుజె కార్యవర్గ సభ్యులు, సీనియర్ మహిళా జర్నలిస్టులు కంచి లలిత, పెద్దిరెడ్డి విజయ తదితరులు మంత్రి కొండా సురేఖకు శాలువా కప్పి సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో హెచ్యుజె వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బట్టిపాటి రాజశేఖర్, ప్రతినిధులు చిట్యాల మధుకర్, క్రాంతి, కొడవటి నవీన్, పూర్ణచందర్, రాజు, రేణయ్య తదితరులు ఉన్నారు.