న్యూఢిల్లీ : అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళ ఛాతీని తాకడం అత్యాచారం కిందకు రాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మహిళా ,శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పు సమ్మతం కాదని , దానిని పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇలాంటి తీర్పులతో సమాజం లోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ..2021 నవంబరు నాటి లైంగిక వేధింపుల కేసు ఇది.ఉత్తరప్రదేశ్ లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల (ఘటన జరిగే నాటికి ) కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని సమీపించారు.
బాలికను ఇంటిదగ్గర దింపుతామని నమ్మించి బైక్పై ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురి చేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యం లోనే కేంద్ర మంత్రి స్పందించారు.