నాగర్కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం, దోమలపెంట వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల్లో శనివారం సొరంగం కూలిన ఘటనలో 8 మంది చిక్కుకున్న విషయం విధితమే. రెండు రోజులుగా వీరిని రక్షించేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ సహాయక చర్యల్ని దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లు బతకడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
2023లో ఉత్తరాఖండ్లోని సిల్క్యారా బెండ్-బర్కొట్ టెన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించిన రాట్ మైనర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కూలిన సొరంగంలోని మట్టి బురదగా మారి సహాయక చర్యలకు అడ్డంకిగా మారినట్లు ఆయన అన్నారు. ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘వాళ్లు బతికే అవకాశం చాలా, చాలా తక్కువ. ఎందుకంటే నేను చివరివరకూ వెళ్లి పరిశీలించాను. అక్కడ నుంచి వాళ్ల పేర్లను మేము పిలిచాము. కానీ ఎలాంటి స్పందన లేదు. మేము ఫోటోలు తీసినప్పుడు సొరంగం ముగింపు కనిపించింది. 30 అడుగుల దూరంలో దాదాపు 25 అడుగులు బురదే ఉంది’ అని అన్నారు.
ఇక ప్రమాదంలో చిక్కుకుంది.. ఉత్తర్ప్రదేశ్కి చెందిన మనోజ్ కుమార్, శ్రీ నివాస్, జమ్ముకశ్మీర్కి చెందిన సన్నీ, పంజాబ్ చెందిన సుర్పీత్ సింగ్, ఝార్ఖండ్కి చెందిన సందీప్ సాహు, జెగ్తా జెస్, సంతోష్ సాహు మరియు అనుజ్ సాహుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు కాగా నలుగురు కూలీలు.