చెన్నై : మక్కల్ నిది మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్)పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ను అధికార డిఎంకె పార్టీ రాజ్యసభకు పంపనుందని తెలుస్తోంది. ఈమేరకు ఆ పార్టీ అధ్యక్షుడు , సిఎం స్టాలిన్ , కేబినెట్ లోని మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్నకు సమాచారం పంపినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జులైలో డీఎంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్హాసన్ను రాజ్యసభకు పంపడానికి డీఎంకే సన్నాహాలు చేస్తోంది. అయితే గత ఏడాది మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకేతో మక్కల్ నిధి మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా , ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు.
దీంతో డీఎంకే అధినేత , సిఎం స్టాలిన్ సలహా సూచనలతో కమల్హాసన్ విరమించుకున్నారు. 2019 లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానం నుంచి తన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి విస్తృతంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కమల్హాసన్ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డిఎంకే ఈ నిర్ణయం తీసుకుందనే సమాచారం.