Saturday, March 15, 2025

సమసమాజానికి దిక్సూచి కార్ల్ మార్క్

- Advertisement -
- Advertisement -

కార్ల్ మార్క్ 1883 మార్చి 14న మరణించారు. మార్చి 17న లండన్‌లోని హైగేట్లో మార్క్ సమాధి దగ్గర ఆయన జీవనసహచరుడు ఏంగెల్స్ ప్రసంగిస్తూ డార్విన్ ఏ విధంగా జీవప్రకృతి అభివృద్ధి నియమాన్ని కనుగొన్నారో సరిగ్గా అదే విధంగా మార్క్ మానవ చరిత్ర అభివృద్ధి నియమాన్ని కనుగొన్నారు… మార్క్ పేరు యుగయుగాల వరకు సజీవంగా వుంటుంది. ఆయన కృషి చిరస్థాయిగా వుంటుంది అని చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మార్క్ 141వ వర్ధంతికి ఒక వ్యాసం రాయాలని కార్ల్ మార్క్ పేరును బింగ్ సెర్చ్‌లో చూస్తే 1 కోటి 55 లక్షల ఫలితాలు వచ్చాయి. ఇతర ప్రముఖులకు అందనంత ఎత్తులో మార్క్ ఉన్నాడు. 141 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం అంతా చర్చిస్తున్న అత్యంత ప్రభావశీల వ్యక్తిగా కొనసాగుతున్నాడు. ఈ వెతుకులాటలో మరో పుస్తకం కనిపించింది. మార్క్ ఇండియాకు వచ్చారు (Marx comes to India) అన్న పేరు ఆకర్షించింది. ఈ పుస్తకాన్ని 1975లో మనోహర్ బుక్ సర్వీసెస్ వారు ప్రచురించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పిసి జోషి, కె దామోదరన్‌లు సంయుక్తంగా సుదీర్ఘమైన ముందుమాట రాశారు. ఈ ముందుమాట లోరెండు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మొదటిది మార్క్ జీవించి ఉన్న కాలంలోనే ఆయనతో కలకత్తాకు చెందిన తొలి సోషలిస్టు భావజాలికులు నెలకొల్పుతున్న సంబంధాల ప్రస్తావన ఆశ్చర్యపరిచింది. మార్క్ సారథ్యంలో 1866లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్‌లో భారతదేశపు విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించమని కోరుతూ ఈ కలకత్తా మిత్రులలో ఒకరు లేఖ పంపించారు. 1871 ఆగస్టు 15న జరిగిన ఇంటర్నేషనల్ జనరల్ కౌన్సిల్‌లో ఆ లేఖను చర్చించినట్లు మినిట్స్‌లో పేర్కొన్నారు. ఈ విభాగం ఏర్పాటుకు అనుమతిస్తూ, స్వయం పోషకంగా వుండాలని, స్థానికులను సభ్యులుగా చేసుకోవాలని సలహా ఇచ్చినట్లు మినిట్స్‌లో వున్న దానిని ముందుమాటలో ఉటంకించారు. అంతేకాదు 1871 ఆగస్టు 19న ‘ది ఈస్ట్రన్ పోస్టు నెంబరు 151’ లో ఇంటర్నేషనల్ జనరల్ కౌన్సిల్ సమావేశంపై ప్రచురించిన వార్తలో కలకత్తా నుంచి అందిన ఉత్తరంలోని కొన్ని భాగాలను ఉటంకిస్తూ వచ్చిన వార్తను యథాతథంగా మన ముందుంచారు. అధికారయుతంగా ఇంత సమాచారం దొరికినప్పటికీ కలకత్తా బృందం పేర్లు మాత్రం రికార్డులలో కనిపించలేదని ముందుమాటలో రాశారు. రెండో అంశం : సోవియట్ విప్లవం తర్వాత మార్క్, ఎంగెల్స్, లెనిన్ రచనలు చాలా వచ్చాయి. కాని, రష్యన్ విప్లవానికి ముందే 1912లో ఉత్తర భారతదేశానికి చెందిన హరదయాళ్, కేరళకు చెందిన రామకృష్ణ పిళ్ళైలు మార్క్ జీవిత చరిత్రలు రాశారు. ఆ రెండు పుస్తకాలను ఇందులో ప్రచురించారు. మార్క్ జీవించివున్న కాలంలో, రష్యన్ విప్లవం జరగడానికి ముందుగానే ఇలా మార్క్ భారతదేశానికి వచ్చిన అపురూపమైన విషయాలను ఈ పుస్తకం వెల్లడిస్తుంది. రష్యన్ విప్లవ ప్రభావం మన దేశంలో జరుగుతున్న జాతీయోద్యమం మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. మార్క్ భావజాలం, రష్యన్ విప్లవ ప్రభావంతో జాతీయోద్యమంలో భాగంగా 1920లో కార్మిక వర్గాన్ని సంఘటిత పరిచే అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడింది. 1923లోనే తొలి మే డేను మద్రాసులో సింగార వేలు నిర్వహించి, ఎర్రజెండాను మొదటిసారి ఎగురవేశారు. వివిధ ప్రాంతాల్లో వున్న కమ్యూనిస్టులు 1925లో కమ్యూనిస్టు పార్టీగా సంఘటితం అయ్యారు. కార్మిక సంఘాలతోపాటు వివిధ ప్రజా సంఘాలను నిర్మించి జాతీయోద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని విస్తరింపజేశారు. గాంధీజీ స్వాతంత్య్రోద్యమానికి సారథిగా గుర్తింపు పొందినా ఈ ప్రజా సంఘాల ఉద్యమాల ఒత్తిడితోనే గాంధీజీ సహాయ నిరాకరణ నుంచి పూర్ణ స్వరాజ్యానికి, ఉప్పు సత్యాగ్రహం పేరుతో శాసనోల్లంఘనకీ అంతిమంగా సాధించడం లేదా మరణించడం నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమానికి పూనుకున్నారు. ఈ ప్రజా ఉద్యమాల వెనుక మార్క్ భావజాలం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతీయ గ్రామీణ వ్యవస్థ ప్రత్యేకతలను, కులవ్యవస్థ పాత్రను విశ్లేషించే వ్యాసాలు రాశారు. అవి నేటికీ అపురూపమైన రచనలుగానే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన క్రమంలో మార్క్ భావజాలం దేశప్రజలలో పొందిన విశేష ఆదరణకి తార్కాణంగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మార్క్ భావజాలం రాజకీయరంగాన్నే కాదు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక పరిణామాలను తెచ్చింది. 1990 దశకంలో మార్క్‌కు గ్రహణం పట్టినట్లు అనిపించింది. సోవియట్ యూనియన్, సోషలిస్టు దేశాలు కనుమరుగు కావడంతో పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు మార్క్ భావజాలానికి కాలం చెల్లిందని ప్రకటించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ చిరస్థాయిగా వుంటుందని ప్రచారం చేశారు. ఈ ప్రచారం మూణ్ణాల ముచ్చ టే అయింది. 2008 నుండి పెట్టుబడిదారీ దేశాలు ఒక దాని తర్వాత మరొకటి చివరికి అన్నీ సంక్షోభంలో కూరుకుపోయా యి. ఉద్దీపనల చిట్కాలు వాటిని గట్టెక్కించలేకపోతున్నాయి. దాంతో పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు బుర్రలు గోక్కుంటున్నారు. పెట్టుబడి చలనసూత్రాల కోసం మార్క్ రచనలే శరణ్యం అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా మార్క్ రచనల అధ్యయనం విస్తారంగా పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపద కేంద్రీకరణ అనివార్యం అని అదే స్థాయిలో పేదరికం, దారిద్య్రం మరొక చోట పేరుకుపోతుందని మార్క్ చేసిన విశ్లేషణ నేటి అంతరాల ప్రపంచం తిరుగులేని వాస్తవంగా నిరూపిస్తున్నది. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాలు పైబడిన మోడీ పాలనను పరిశీలన చేసుకోవాలి. మోడీ పాలనలో ప్రపంచంలోనే అత్యధికంగా అంతరాలు పెరిగిన దేశంగా మారింది. 2013 నాటికి 50 మంది బిలియనీర్లు అంటే 100 కోట్లకు పైబడిన డాలర్ల సంపదగలవారు లేదా 8000 కోట్లకు రూపాయలకు పైబడిన సంపదగలవారు వుంటే 2024 నాటికి 169 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ప్రపంచ బిలియనీర్లలో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి దూసుకుపోయింది. ఈ 169 మంది బిలియనీర్ల దగ్గరే రూ. 78 లక్షల కోట్ల సంపద పోగుపడింది. ఆక్స్‌ఫామ్ నివేదికల ప్రకారం దేశంలో 1 శాతం దగ్గర 46 శాతం దేశసంపద పోగుపడగా 10 శాతంగా ఉన్న బిలియనీర్లు, కార్పొరేట్లు, కుబేరుల దగ్గర మొత్తం దేశ సంపదలో 77 శాతం గుట్టపడింది. ఒక దశాబ్దకాలంలోనే విపరీతంగా దేశంలో సంపద కేంద్రీకరణ జరిగింది. స్థూలంగా 10 ఏళ్ల మోడీ పాలన ప్రధానంగా కార్పొరేట్ల కోసం సాగినపాలన. దాని పర్యవసానంగానే దేశసంపద వారి పంచకు చేరింది. ఈ 10 ఏళ్ల లో 35 శాతం గావున్న కార్పొరేట్ పన్నును అంచెలంచెలుగా 22 శాతానికి తగ్గించారు. వారికే దాదాపు 20 లక్షల కోట్ల అప్పులను రద్దు చేశారు. గతంలో 10 శాతం వున్న వారసత్వ పన్నును పూర్తిగా తొలగించారు. ఇది మోడీ పాలన సంగ్రహ చిత్రం. దేశ సంపదను కార్పొరేట్లు స్వంతం చేసుకుంటూపోతున్నారు. మరో పక్క రైతులు, సామాన్యులు, పేదలు కార్పొరేట్ల అనుకూల పాలనలో నలిగిపోతున్నారు. 10 శాతంగా వున్న కార్పొరేట్ల దోపిడీకి- 75% నలిగి పోతున్న దేశ ప్రజలకీ మధ్య నెలకొన్న వైరుధ్యమే ప్రస్తుత ప్రధాన వైరుధ్యంగా గుర్తించాలి. మార్క్ ఏనాడో చెప్పిన సంపద కేంద్రీకరణ దాని పర్యవసానాలు ఇప్పుడు మోడీ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కార్పొరేట్ల దోపిడీని కట్టడి చెయ్యడానికి, శ్రమజీవుల సంక్షేమ విస్తరణకి పోగుపడ్డ సంపద పునఃపంపిణీ తక్షణ అవసరం అయింది. ఈ దిశగా అన్ని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రజలను సమీకరించే ఉద్యమాలకు సన్నద్ధం కావాలి. మోడీ పాలనాపరంగా బలహీనుడే, ప్రజల మీద భారాలు మోదే సాధారణ రాజకీయ నాయకుడే, కార్పొరేట్ దోపిడీకి ద్వారాలు తెరిచేవాడే.ఆయన ప్రజాకర్షణ ఆయన అనుసరిస్తున్న రాజకీయ విధానాలలో లేదు. విభజన రాజకీయంలో విద్వేష భావజాలంలో వుంది. దానిని తన ఆకర్షణగా మార్చుకునే పరిభాషలో వుంది. అందువల్ల మోడీ రాజకీయం మీద చేసే పోరాటం కేవలం ఆర్థిక అంశాల మీద చేస్తేసరిపోదు. మోడీ రాజకీయం మీద పోరు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కతిక రంగాలన్నింటా జరగాలి. ఇందులో సాంస్క తిక రంగంలో జరిగే పోరాటం కీలకం అవుతుంది. అలాంటి బహుముఖ పోరాటాలకు, ప్రజాఉద్యమాలకు మార్క్ భావజాలమే మనకు దారి చూపిస్తుంది. సమసమాజ సాధనకు ఆయనే దిక్సూచి.

– డివివియస్ వర్మ
85006 78977

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News