వాషింగ్టన్ : అమెరిక దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ కొత్త డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తి కాశ్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేయడం విశేషం. యుఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఆటార్నీ జనరల్ పామ్ బోండీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గర్ల్ ఫ్రెండ్ భగవద్గీతను పట్టుకోగా కాశ్ పటేల్ దానిపై చేయి ఉంచి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత కాశ్ పటేల్ విలేకరులతో మాట్లాడారు.
ఇకపై ఎఫ్బిఐ లోపల, వెలుపల జవాబుదారీతనం ఉంటుందని ఆయన చెప్పారు. మరొక వైపు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయంలోని వెయ్యి మంది ఉద్యోగులను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఫీల్డ్ ఆఫీసులకు బదలీ చేయనున్నట్లు కాశ్ పటేల్ ప్రకటించారు. అదే విధంగా మరి 500 మందిని అలబామా, హంట్స్విల్లేలోని బ్యూరోకు పంపించనున్నట్లు ఆయన తెలియజేశారు. కాగా, కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన పాలకవర్గంలో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న విషయం విదితమే.