టిఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో అప్పటి టిఆర్ఎస్ రైతు నాగలి బ్యానర్ను సోమవారం నాడు బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు చేత పునరావిష్కరణ చేయించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు ఆనాటి పార్లమెంటరీ ఉద్యమ పంథా పోరాట జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాగా…నాటి బ్యానర్ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కెసిఆర్ అభినందించారు. రజతోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్సి శేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంఎల్ఎ నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు… తదితర ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.
టిఆర్ఎస్ తొలిపోటీలో జయకేతనం
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001లో జరిగింది. ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరుగగా, తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ సారథి కెసిఆర్ దార్శనికతతో స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ జనం తీర్పుకోసం అధినేత నిర్ణయంతో ఎన్నికల్లో పాల్గొంది. 2001 జూలై 3న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలుపగా, ఆ ఎన్నికల్లో 82 మంది టిఆర్ఎస్ జెడ్పిటిసిలు, వందలాది మంది ఎంపిటిసిలు జయకేతనం ఎగురవేశారు.ఆ ఎన్నికల్లో నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జెడ్పిటిసిగా నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్రెడ్డి విజయం సాధించారు.