Wednesday, July 3, 2024

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయండి: హైకోర్టులో కెసిఆర్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై హైకోర్టును మాజీ సిఎం కెసిఆర్ ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వెల్లడించారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రిట్ పిటిషన్‌లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని చేర్చారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన విద్యుత్తు కొను గోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్- 1952 కింద ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే విచారణను ప్రారంభించి, తెలంగాణ విద్యుత్తు సంస్థలకు చెందిన దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారిం చింది. దీంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కూడా ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.

కెసిఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖను ఈ నెల 15వ తేదీన కమిషన్‌కు పంపించారు. తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మా ణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని కెసిఆర్ అంటున్నారు. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డికి ఈ అంశాలపై విచారణ జరిపే అర్హత లేదని వాదిస్తున్నారుు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వెంటనే స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నర్సింహారెడ్డిని డిమాండ్ చేశారు.

కమిషన్ విషయంలో ప్రభుత్వం పేర్కొన్న అంశాలకు, జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు లేఖలో సమాధాన మిచ్చారు. న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ప్రభుత్వానికి సూచించకుండా, విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించడం విచారకరమని కెసిఆర్ అంటున్నారు. చివరికి న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీల అధికార పరిధి గురించి చట్టంలో ఏముందో కూడా గమనించకుండా మీరు మాట్లాడారని అంటున్నారు. లేఖలో పేర్కొన్న అంశాలతోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News