Wednesday, April 2, 2025

ముస్లింలకు కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

ఇస్లాం మతస్తుల పవిత్ర మాసం రంజాన్ పర్వదినాల ముగింపు ‘ఈద్ ఉల్ ఫితర్’ సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో కూడిన ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో ప్రశాంతమైన చిత్తంతో రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో శాంతి సౌభ్రాతృత్వ భావనలు ఫరిఢవిల్లుతాయని అన్నారు. భిన్న మతాల సంప్రదాయాలతో కూడిన జీవన విధానం, గంగా జమున తెహజీబ్‌కు తెలంగాణ నేల నిలయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమ కాలం నుంచి స్వరాష్ట్రంలో సాగిన పదేండ్ల ప్రగతి పాలన దాకా ముస్లిం మైనారిటీలను తాము ప్రధాన భాగస్వాములను చేశామని తెలిపారు. విద్యా తదితర రంగాల్లో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వినూత్న కార్యక్రమాలను కెసిఆర్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.

అన్ని మతాలను గౌరవిస్తూ మతసామరస్యానికి కాపాడుతూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద విలువలను అమలుచేస్తూ, నాటి తొలి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణ నూతన తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిపిందని అన్నారు. ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పిందని, తద్వారా దేశ విదేశాలనుంచి హైదరబాద్‌కు పెట్టుబడులు తరలివచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో పాలనపై పూర్తి విశ్వాసంతో హైదరబాద్‌లో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకున్నారని తెలిపారు. తద్వారా రాష్ట్ర ఆర్ధిక స్థితి వూపందుకోవడం, రియల్ ఎస్టేట్, ఫార్మా, సహా పలు రంగాల్లో తెలంగాణ యువతకు లక్షలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయని పేర్కొన్నారు. నాటి బిఆర్‌ఎస్ అనుసరించిన విధానాలు ప్రజల్లో పరమత సహనాన్ని పెంచి, తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమికను పోషించాయన్నారు. ప్రజల నడుమ సౌభ్రాతృత్వ భావనలు, ప్రేమాభిమానాలతో తాము వేసిన సామాజిక ఐక్యతా పునాదిని కొనసాగించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాలని కెసిఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News