Sunday, September 8, 2024

సింగరేణిపై భారీ కుట్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి/గోదావరిఖని: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖనిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సింగరేణిపై చాలా పెద్ద కుట్ర జరగబోతుందని ఆరోపించారు. ఒకప్పుడు సింగరేణిని ముంచిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ అదే కుట్రకు తెరతీయబోతుందన్నారు. ప్రధాని మోడీతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుయుక్తులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, భాజాపాకు ఓట్లు… సీట్లు కావాలి కానీ ప్రజా సమస్యలు పట్టవని, అడ్డగోలు వా గ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఆ రు గ్యారెంటీలు ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు.

పక్కనే గోదావరి ఉన్న నీళ్లు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, పెద్దపల్లి జిల్లాలో 50 వేల ఎకరాల పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోయాయని అన్నారు. సింగరేణి సంస్థను నిండాముంచింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మరోమారు సింగరేణి సంస్థను ముంచేందుకు సిద్ధమైన కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేస్తే నట్టేట మునిగినట్లేనని అన్నారు. బడే భాయ్, చోటే భాయ్ తెలంగాణ ప్రజలకు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి పార్టీకి 200 సీట్లు కూడా రావని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. రైతుల రుణ మాఫీ, నిరుద్యోగ భృతి ఏమైందని అన్నారు.

సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాలు పని చేసి ఈ ప్రాంత నాయకుడు కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు కౌశిక హరి, టిబిజికెఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి, బిఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News