తిరుపతి: తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. గురువారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. ఆలయ డీప్యూటీ ఇఒ నాగరత్న, ఎఇఒ రవి, సూపరింటెండెంట్ ముని శంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.