తనకు మంత్రి పదవి వస్తుందని మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఓ కొలిక్క వస్తున్న సమయంలో ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హోంమంత్రిత్వ శాఖ అంటే తనకు ఆసక్తి ఉన్నప్పటికీ, అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడతానని అన్నారు. ఢిల్లీలో సీరియస్గానే కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉంది అని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి తనకు ఢిల్లీ నుండి ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. గతంలో భువనగిరి ఎంపి పదవిని సమర్థవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో సోమవారం సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమై, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణతో సహా పలు అంశాలపై వారు చర్చించిన విషయం తెలిసిందే.