ముంబై: పలువురు హీరోలు దర్శకులుగా మారిన సందర్భాలు గతంలో చూశాం. తమ సినిమాలను తామే డైరెక్ట్ చేసుకొని సక్సెస్ని అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మరో హీరో ఇదే బాటలో నడవనున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సిరీస్లో వచ్చిన మూడు సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ సిరీస్లో రానున్న నాలుగో చిత్రానికి హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ అభిమానులతో పంచుకున్నారు.
క్రిష్ చిత్రాలకు ఇప్పటివరకూ రాకేశ్ రోషనే దర్శకత్వం వహించారు. కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన క్రిష్-4 సినిమాకు దర్శకత్వం వహించడం లేదని తెలిపారు. దీంతో ఈ సినిమాకు దర్శకత్వం ఎవరూ చేస్తారా..? అని చర్చ జరిగింది. ఈ క్రమంలో రాకేశ్.. హృతిక్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు చేసిన పోస్ట్ అభిమానుల్లో ఆనందం నింపింది.
‘‘25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత నేను, ఆదిత్యచోప్రా నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము. దర్శకుడిగా కూడా నువ్వు ఎన్నో విజయాలు అందుకోవాలి. ప్రతిష్టాత్మక ‘క్రిష్-4’కి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది’’ అంటూ రాకేశ్ రోషన్ పోస్ట్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. కామెంట్ చేస్తున్నారు.