Saturday, July 6, 2024

ఎంఎల్‌ఎలపైనే కేసులా?

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కౌశిక్ రెడ్డి, కోవ లక్ష్మీలపై కేసు నమోదు చేయటాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టటమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రశ్నించే మీడియా, ప్రజాప్రతినిధులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడిన సరే బిఆర్‌ఎస్ ప్రజా గొంతుకగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇప్పటికైనా ప్రతీకార చర్యలు మాని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని సూచించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా..? : కెటిఆర్
ప్రజా సమస్యలను జెడ్‌పి సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పన పైన మండల విద్యాధికారితో ఎంఎల్‌ఎ సమావేశం నిర్వహించటం తప్పా అని ప్రశ్నించారు. ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారు అంటూ మండల విద్యాధికారులకు డిఇఒ అక్రమంగా నోటీసులు ఇవ్వటమేమిటి అని అడిగారు. ప్రభుత్వాధికారి అయిన డిఇఒ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగ వ్యవహారిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇదే అంశాన్ని జెడ్‌పి సమావేశంలో లేవనెత్తినట్లు కెటిఆర్ తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించటానికి కూడా కౌశిక్ రెడ్డికి హక్కు లేదా అని ప్రశ్నించారు.

దళిత బంధు చెక్కుల పంపిణీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇవ్వడంతోపాటు మహిళల కోసం అదనంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించాలని తమ పార్టీ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ అడిగారని, ఇది కూడా నేరమేనా..? అని కెటిఆర్ నిలదీశారు. అలాగే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కోవా లక్ష్మీపైన ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసు నమోదు చేయడాన్ని కెటిఆర్ ఖండించారు. స్థానిక ఎంఎల్‌ఎకు సరైన గౌరవం, ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపినందుకు పోలీసులు, ఎంఎల్‌ఎపైనే ఏకపక్షంగా కేసు నమోదు చేయడం అక్రమం అని పేర్కొన్నారు. పోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News