Wednesday, July 3, 2024

సిఎం అంటే కటింగ్ మాస్టరా..?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిఎం అంటే కటింగ్ మాస్టరా..? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెట్టడమే లక్ష్యమా..?.. సిఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా..? ఎక్స్ వేదికగా నిలదీశారు. ఎన్నికల ముందు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి.. ఇప్పుడు ఆ హామీల్లో కోతలు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారని.. నేడు రూ.2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. రూ.39 వేల కోట్లు.. ఇప్పుడు రూ.31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారని మండిపడ్డారు. పాసుబుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించమని హెచ్చరించారు. రేషన్ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించమని పేర్కొన్నారు.

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మొన్న లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారని.. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రూ.2 లక్షల రుణమాఫీని కూడా ఎగొట్టేందుకు లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని అన్నారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదని.. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రచారంలో ‘అందరికీ అన్నీ’ అన్నారని.. అధికారంలోకి రాగానే ‘కొందరికే కొన్ని’ అంటూ కోతపెడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం.. పోరాటం చేస్తాం…జై కిసాన్…జై తెలంగాణ అంటూ కెటిఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News