Sunday, September 8, 2024

“మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతం రేవంత్ చెప్పాలి”

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50 వేల కోట్లు అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని,  నిన్న 70 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారని, ఇవాళ లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామనడం వెనుక ఉద్దేశం ఏమిటి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీదాకా కాంగ్రెస్ పార్టీ గగ్గోలుపెట్టిందని, సుందరీకరణకే రూ.లక్షా యాభై వేల కోట్లా ఖర్చుపెడుతారా? అని చురకలంటించారు. పదిహేను పక్కన ఇన్ని సున్నాలు 15,000,000,000,000 ఉంటాయని, ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులు ఎందరు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నిల్వ ఉంచే టిఎంసిలతో సాగులోకి వచ్చే ఎకరాల గురించి చెప్పాలని చురకలంటించారు. పెరిగే పంటల దిగుబడితో పాటు తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎన్ని ఉన్నాయని, కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని దుయ్యబట్టారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అని నిలదీశారు. చివరిదశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అని, లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి ?? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెటిఆర్ అడిగారు.

మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం అని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందేనని, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందేనని, కానీ.. మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించం తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించమని హెచ్చరించారు. “మూసీ రివర్ ఫ్రంట్” పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందని, కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడుతుందని కెటిఆర్ విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News