ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఫ్యాక్టరీని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. సిసిఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బిజెపి, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమే అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిజెపి అంటే నమ్మకం కాదు… అమ్మకం అని విమర్శించారు. సిసిఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్థనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
772 ఎకరాల భూమి, 170 ఎకరాల టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలతో సకల వనరులు కలిగిన ఈ సంస్థను అంగడి సరుకుగా మార్చిన పాపం మోడీ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. సిసిఐకి చెందిన ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్క కట్టి ఆన్లైన్లో అమ్మడానికి టెండర్లు పిలవడం బిజెపి ప్రభుత్వ దగుల్భాజీ తనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. నిర్మాణ రంగంలో సిమెంట్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సిసిఐని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని పదుల సార్లు కేంద్ర మంత్రులను తమ ప్రభుత్వం కోరినా, కనీసం వారు కనికరించకపోవడం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేసింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సిసిఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందని కెటిఆర్ అన్నారు. సిసిఐను తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్లోని వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోదీతో పలుమార్లు ఈ విషయంపై నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చలు జరిపారని గుర్తు చేశారు. తానే స్వయంగా కేంద్ర మంత్రులైన నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే, పీయూష్ గోయల్లను పలుమార్లు కలవడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశానని తెలిపారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం లేదా జాయింట్ వెంచర్ రూపంలో సిసిఐ యూనిట్ను తిరిగి తెరిచే విషయాన్ని పరిశీలిస్తామని 2016లో అప్పటి కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి అనంత్ గీతే ప్రకటించారని గుర్తుచేశారు.
కానీ కేంద్రమంత్రి మాటలు నీటి మీది రాతలుగానే మిగిలాయని విమర్శించారు. 2018 ఎన్నికల ప్రచారంలో సిసిఐని తెరుస్తామని హామీ ఇచ్చిన బిజెపి, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్గా అమ్మేందుకు ఆన్లైన్ టెండర్లు పిలవడం ఆదిలాబాద్ ప్రజలకు చేసిన మోసమేనని ఆరోపించారు. అదిలాబాద్ వచ్చిన ప్రతి సందర్భంలో బిజెపి నాయకులు సిసిఐని తెరిపిస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు మర్చిపోయారని విమర్శించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా నుంచి మొదలుకొని హంసరాజ్ గంగారం వరకు ప్రతి ఓక్కరూ ఎన్నికల్లో లబ్ధి కోసం సిసిఐ తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అప్పనంగా అమ్మివేస్తున్నారని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని, సంస్థ పరిరక్షణ కోసం పోరాడతామని కెటిఆర్ ప్రకటించారు.