Wednesday, September 18, 2024

బిఆర్‌ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి కి వెన్నులో ఎందుకంత వణుకు?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేయటంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బిఆర్‌ఎస్ నేతలను అర్థరాత్రి వరకు అక్రమ అరెస్ట్‌లు చేసి..శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా..? అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవటానికి కూడా అనుమతి లేదా..? అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ నేతలను గృహనిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బిఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అని, బిఆర్‌ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని అన్నారు.

ఎంఎల్‌ఎలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారు
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే చాలు ప్రజాప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎంఎల్‌ఎలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బిఆర్‌ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని… సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ది చెబుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News