Tuesday, September 17, 2024

కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రోకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై ప్రధాని మోడీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారన్నారు. ఎన్నిసార్లు తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంత కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లోనూ మళ్లీ హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోడీ తన తెలంగాణ వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారని చెప్పారు. అదే ద్వేషాన్ని మన రాష్ట్ర అభివృద్ధిని నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపికి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చినా అదే వివక్షా..?
కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో గెలిచే పార్టీ ఎంపీలు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని భావించిన తెలంగాణ ప్రజలు ఈ సారి బిజెపికి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని, కానీ ఏం ప్రయోజనం అని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కన్నా కూడా మనకు నిధుల్లో కోతలు పెట్టారన్నారు. మరి మన రాష్ట్రం నుంచి గెలిచిన బిజెపి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బిజెపికి 8 సీట్లు ఇచ్చింది.. రాష్ట్రంపై ఇలా వివక్షను మరింత చూపేందుకేనా అని అడిగారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకు ఎన్నోసార్లు నిధులు కావాలని అడిగితే పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఇదే కేంద్రం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్ట్‌లకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందని లెక్కలతో సహా కెటిఆర్ వివరించారు. ఉత్తర ప్రదేశ్ (4 ప్రాజెక్టులు) – రూ. 5,134.99 కోట్లు,

మహారాష్ట్ర (3 ప్రాజెక్టులు) – రూ. 4,109 కోట్లు, గుజరాత్ (3 ప్రాజెక్టులు) – రూ. 3,777.85 కోట్లు, ఢిల్లీ (2 ప్రాజెక్టులు) – రూ. 3,520.52 కోట్లు, కర్ణాటక- రూ. 1880.14 కోట్లు, మధ్యప్రదేశ్ (2 ప్రాజెక్టులు) – రూ. 1,638.02 కోట్లు, బీహార్ – రూ. 1,400.75 కోట్లు, తమిళనాడు – రూ. 713 కోట్లు, కేరళ (2 ప్రాజెక్టులు) – రూ. 146.74 కోట్లు, రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ (ఢిల్లీ -ఘజియాబాద్) – రూ. 1,106.65 కోట్లు అని తెలిపారు. గత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించిందని, కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోడీకి వివరించి రాష్ట్ర బిజెపి ఎంపీలు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News