Saturday, March 15, 2025

ఇది ప్రజాపాలన కాదని ప్రజలను వేధించే పాలన:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఇది ప్రజాపాలన కాదని ప్రజలను వేధించే పాలన అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అని దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి మాకెందుకు తెలియదు, హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారని, కానీ 15 నెలల పాలనలో ఊదు గాలింది లేదు.. పీరు లేసింది లేదని ధ్వజమెత్తారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ 420 హామీలను చూసి మోసపోయాయని ఎక్స్ వేదికగా విమర్శించారు. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుందని తెలిపారు. కానీ రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, రైతుబీమా ప్రీమియం కట్టలేదు, సాగునీళ్లు రాలేదు, పంటల కొనుగోళ్లు జరగడం లేదు,

రూ.500 క్వింటాలు ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదని అన్నారు. కెసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ మాయమైంది, దవాఖానాల్లో మందులు లేవు, వరంగల్ దవాఖాన నిర్మాణం నిలిపేశారు, టిమ్స్ దవాఖానల నిర్మాణం ఆపేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా.. రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కన్నీరు పెట్టిస్తున్నారని, పాలమూరు రంగారెడ్డి పనులు పడావు పెట్టారని మండిపడ్డారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని, విషాహారం తిని ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. తెచ్చిన అప్పులను 20 శాతం కమీషన్లు దండుకుని బిల్లులు చెల్లిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అని, రైతులు, రైతుకూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత, ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ 420 హామీలను చూసి మోసపోయాయరని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News