మన తెలంగాణ/ హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలో భూములు ఎవరూ కొనొద్దని, ఒకవేళ ఎవరైనా కొన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలలో అద్భుతమైన ఏకో పార్క్ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో తమ పార్టీని ఏకపక్షంగా గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా ఆ భూముల్ని కొనుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. హెచ్సియు భూముల వివాదంపై తెలంగాణ భవన్లో గురువారం బిఆర్ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్సియులో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి నిర్ణయాన్ని మార్చుకోకపోతే వేలాది మందితో హెచ్సియుకి మార్చ్ లాగా తరలి వెళ్తామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలో జరిగిన పోరాటాలకు ధీటుగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ విరోచితంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. పది రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే కనీసం వారితో చర్చలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు, పెయిడ్ బ్యాచ్ అనడం ముఖ్యమంత్రి, మంత్రుల అహంకారానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అక్కడ జంతువులే లేవు, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అని భట్టి విక్రమార్క తన కృత్రిమ మేధను బయట పెట్టుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి నియంతనో..బాసో కాదు అని సేవకుడు మాత్రమే అని పేర్కొన్నారు. మంత్రులైనా.. ఎంఎల్ఎలైనా, ఎంఎల్సిలైనా..అందరూ ప్రజా సేవకులే అని పేర్కొన్నారు. పేరుకే ప్రజా పాలన అని, ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని విమర్శించారు.
మేం పాలకులం… మీరందరూ మా కాలి కింద చెప్పులు.. బానిసలు.. అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమే అని వ్యాఖ్యానించారు. రోజుకు 18 గంటలు పని చేస్తా అని చెప్పుకునే సిఎం రేవంత్ రెడ్డి కనీసం పది నిమిషాలు మనిషాలైనా ఈ విషయంపై ఆలోచించాలని అన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రోజుకు 18 గంటలు పని చేయకుండా ఒక పది నిమిషాలు ఒక తండ్రి లాగా, ఒక తాత లాగా, భవిష్యత్ తరాల మీద సోయితోని రేవంత్ ఆలోచించాలని సూచించారు.
ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఎక్కడున్నారు..
సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ సర్కార్ తీరు దారుణంగా ఉందని కెటిఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి దొంగలు లాగా అక్కడ పనులు ఎందుకు చేపిస్తున్నారని ప్రశ్నించారు. పది రోజులు సమయం ఇవ్వండి అని కోర్టుకు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల్లాగా ఎందుకు అక్కడ చెట్లు కొట్టేస్తూ వన్యప్రాణులను చంపేస్తుందని నిలదీశారు. కోర్టు సెలవులను చూసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందని మండిపడ్డారు. శని, ఆదివారాలు ప్రజల మీదికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయని హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పిన ప్రభుత్వానికి బుద్ధి రాదా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫుట్బాల్ ఆడడానికి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమతో ఫుట్బాట్ ఆడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారని చెప్పారు. హైదరాబాద్ భవిష్యత్తు కోసం విద్యార్థులు కొట్లాడుతున్నారని, విద్యార్థుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హెచ్సియులో చదువుకుంటున్న విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో ఇసుమంతైన రేవంత్ రెడ్డికి ఉందా..? అని నిలదీశారు. ప్రజా పాలన అంటే విద్యార్థులపై దాడి చేయడమా..? అని నిలదీశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఎక్కడున్నారు..? అని అడిగారు. రోహిత్ వేముల మరణంపై నిరసన తెలపడానికి రాహుల్ గాంధీ వస్తే హెచ్సియుకి అప్పటి తమ ప్రభుత్వం ఎస్కార్ట్తో తీసుకెళ్లిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే హెచ్సియులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లల బట్టలు చించి జుట్టు పట్టుకొని పోలీసులతో కొట్టిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మొహబ్బత్కి దుకాణ్ లా కాదు నఫరత్ కా మకాన్ లాగా తెలంగాణ మారిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓ లాపతా లీడర్, ఓ పొలిటికల్ టూరిస్ట్ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ విద్యార్థులతో కలిసి మాట్లాడాలన్నారు.
ఆ 400 ఎకరాలే ఎందుకు
ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాల భూమి ఉండగా.. హెచ్సియులో ఉన్న ఆ 400 ఎకరాలే ఎందుకు…ఆ 400 ఎకరాల భూముల్లో మూగజీవాలు కనిపించడం లేదా..? అని కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం అని, ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ హయాంలో కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవం చేపడితే.. అప్పుడు హైదరాబాద్కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది కెటిఆర్ గుర్తు చేశారు. పశ్చిమ హైదరాబాదులో ఉన్న ఒకే ఒక్క లంగ్స్ స్పేస్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు అని, దాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. తమ గూడును చెదరగొట్టొద్దని అక్కడి నెమళ్లు పశువులు అరుస్తుంటే.. ఏడుస్తుంటే ప్రభుత్వంలోని ఏ ఒక్కరికి బాధనిపిస్తలేదా..? అని ప్రశ్నించారు. హెచ్.సి.యు విద్యార్థుల పోరాటం మీద రెండు రోజులుగా కెసిఆర్ తమ పార్టీ నేతలతో పాటు హైదరాబాద్ చెందిన కొంతమంది ముఖ్యులతో చర్చించారని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చి ఎన్నో జాతీయ,అంతర్జాతీయ అవార్డులను సాధించామని గుర్తు చేశారు. కెసిఆర్ హయాంలో 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించామని, హైదరాబాదులో 7.7 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో, గ్రీన్ కవర్ను పెంచడంలో తెలంగాణ దేశంలోని నెంబర్వన్గా నిలవడం తాము సాధించిన రికార్డ్ అని పేర్కొన్నారు. దేశంలోని అత్యధికంగా గ్రీన్ కవర్ పెరిగిన రాష్ట్రం తెలంగాణ అని, 2021లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 108 అర్బన్ లంగ్ స్పేసెస్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్ల వెంబడి వందలాది కిలోమీటర్లు చెట్లను పెంచామని, ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్ర భారతదేశంలో తెలంగాణ ఒక్కటే అని, రాష్ట్రంలో 14,864 నర్సరీలు ఉన్నాయని అన్నారు. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి తమకు ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.
రాజ్యసభలో మా ఎంపీలు లేవనెత్తారు
రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తే రాజనీతిజ్ఞుడు తర్వాతి తరం కోసం ఆలోచిస్తారని కెటిఆర్ తెలిపారు. కోర్టుల్లో తమ ప్రభుత్వ హయాంలో కొట్లాడడంతోనే ఆ భూమి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు దక్కిందని అన్నారు. రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి తాము కొట్లాడలేదని, ఢిల్లీ లాగా హైదరాబాద్ మారొద్దు అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్స్ స్పేస్ ఉండాలన్న దూర దృష్టితో తాము కొట్లాడామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే నిర్ణయాన్ని మార్చుకోకపోతే హైదరాబాద్ ప్రజలతో పాటు పెద్ద ఎత్తున తమ పార్టీ కార్యకర్తలం, ప్రజా ప్రతినిధులు అందరం హెచ్సియు మార్చ్ లాగా తరలి వెళ్తామని చెప్పారు.
రాజ్యసభలో తమ ఎంపీలు సురేష్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర ఈ విషయాన్ని లేవనెత్తారని తెలిపారు. ఈ వ్యవహారంలో హెచ్. సి.యు విద్యార్థులకు న్యాయపరంగా అండగా ఉంటామని చెప్పారు. ఇది రాజకీయ కొట్లాట కాదు అని, హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. ఈ పోరాటంలో కలిసివచ్చే పర్యావరణవేత్తలకు అండగా ఉంటామని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంత జీవ వైవిధ్యం ఉందో ప్రభుత్వానికి అంచనా లేదని, యుద్ధానికి పోయినట్టుగా ఈ ప్రభుత్వం హెచ్సియుపై దండయాత్రకు వెళ్లిందని మండిపడ్డారు. బండి సంజయ్ అప్పుడప్పుడు పార్లమెంట్కు వెళ్లి భారత ప్రభుత్వ నివేదికలు చదువుకోవాలని సూచించారు.