రేవంత్ అనాలోచిత నిర్ణయాలతోనే అన్నదాతల
ఆత్మహత్యలు కేవలం రైతు సంక్షేమం కోసమే
అధ్యయన కమిటీ ఈ నెల 24 నుంచి నెల రోజుల
పాటు రాష్ట్రమంతటా కమిటీ పర్యటన
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నా రు. రేవంత్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ఇ చ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై వే సిన తమ కమిటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, కేవలం రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదని స్పష్టం చేశారు. బుధవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమావేశమైన అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్ బ్యాంకులో ఆత్మహత్య చేసుకున్న రైతు విషాద ఘటనే ఈ కమిటీ వేయడానికి కారణం అని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఆదేశం మేరకు ఏర్పాటైన ఈ కమిటీ శుక్రవారం(జనవరి 24) నుంచి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి పని ప్రారంభిస్తుందన్నారు. రాబోయే నెల రోజులపాటు అన్ని జిల్లాలలో అన్ని వర్గాల రైతులను కలిసి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది..? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది..?..కరెంటు సరఫరా ఎలా ఉంది..?.. సాగు పరిస్థితి ఎలా ఉంది..? మద్దతు ధర దొరకుతుందా..? బోనస్ ఏమైంది..? కొనుగోలు కేంద్రాలు ఏమయ్యాయి..? రైతు వేదికలు పనిచేస్తున్నాయా..? వంటి అంశాలను అధ్యయనం చేస్తుందని తెలిపారు. రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఆత్మహత్యలకు కారణాలను అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తుందని, ఆ నివేదికను బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందని వెల్లడించారు.
కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు రైతుల్లో ఆత్మవిశ్వాసం అపారంగా ఉండేది
రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చిందని కెటిఆర్ అన్నారు. 2 లక్షల రుణమాఫీ, 15 వేల రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ ఇవ్వడంతో పాటు విస్తారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీలను నమ్మి రైతులు ఆ పార్టీకి అధికారాన్ని అప్పగించారని పేర్కొన్నారు. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని విమర్శించారు. రైతుల పట్ల కెసిఆర్కు ఉన్న ప్రేమ, ఆర్తి ప్రస్తుత పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదని చెప్పారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న
పెద్దల మాటను వందకు వంద శాతం నమ్మి అందుకు తగ్గట్టుగానే 65 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా ఆధారపడిన వ్యవసాయరంగ సంక్షేమానికి కెసిఆర్ ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. రైతుబంధు, రుణమాఫీ పేరుతో లక్ష కోట్ల రూపాయలను నేరుగా 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో కెసిఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్లో ఆత్మవిశ్వాసం అపారంగా ఉండేదని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, భూమిశిస్తు రద్దు, నీటి తీరువ రద్దు, చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడే మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు నిర్మాణాలతో స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయని విప్లవాత్మక పనులను రైతుల కోసం కెసిఆర్ చేశారని చెప్పారు. రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రశంసించిందని గుర్తు చేశారు.
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు
ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందన్న అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కెటిఆర్ విమర్శించారు. తమ హయాంలో 6 లక్షల 47 వేల పైచిలుకు రేషన్ కార్డులను మీ- సేవా కార్యాలయాల్లో ఇచ్చామన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న పబ్లిసిటీ పిచ్చి తమకు లేదని అన్నారు. రుణమాఫీ, రైతుబంధు గురించి గ్రామసభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని పేర్కొన్నారు. ప్రజలంతా స్వచ్చందంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాని, ఆ ఆందోళల్లో ఎక్కడా తమ పార్టీ నేతలు లేరని వెల్లడించారు. హోంమంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పడకేశాయని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా పోస్టులకు భయపడి అరెస్టుల చేసే తాపత్రయం సిఎం రేవంత్ది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఫార్ములా కేసు అయితే, తమ ప్రాధాన్యత ఫార్మర్ అని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా త్వరలోనే నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామని కెటిఆర్ వెల్లడించారు.