హైదరాబాద్: ప్రపంచంలోనే హైదరాబాద్ సురక్షితమైన నగరమని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హెచ్ఐసిసిలో హైసియా ఆధ్వర్యంలో బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. భౌగోళికంగా కూడా హైదరాబాద్ అత్యంత సేఫెస్ట్ సిటి. స్థిరమైన ప్రభుత్వం ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయి. ఒక్కరోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రాలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతూ వృద్ధిని కొనసాగిస్తున్నాము. ఐటిలో బెంగళూరు కంటే ఎక్కడ వెనుకబడ్డామో పరిశీలించుకుంటున్నాం. గత ఐదేళ్లలో ఐటి పెట్టుబడులు రెట్టింపుయ్యాయి. ఐటి అభివృద్ధికి మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు, లాజిస్టిక్స్ అవసరం. 5 ప్రఖ్యాత ఐటి కంపెనీలు హైదరాబాద్ ను తమ రెండో చిరునామాగా ప్రకటించాయి. కంపెనీలు ప్రకటించిన పెట్టుబడుల్లో 40శాతం కార్యరూపం దాల్చాయి. అమెజాన్ కంపెనీ మొదట బెంగళూరును ఎంచుకుంది. తెలంగాణ పన్ను విధానాలు నచ్చి అమెజాన్ హైదరాబాద్ కు వచ్చింది. అమెజాన్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్ లోనే ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
అమెజాన్ హైదరాబాద్ కు వచ్చేందుకు అధికారులు ఎంతగానో కృషి చేశారు. ఐటి కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం అనేక విడతలుగా చర్చలు జరిపింది. కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ స్టార్టప్ ల పాలిట స్వర్గధామంగా మారింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో రాష్ట్రాన్ని ఉన్నతస్థానంలో నిలబెడతాం. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ హబ్ గా మారుతోంది. డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీసజెంట్రలైజేషన్ లదే భవిష్యత్ అంతా. ఐటి, పార్మా, లైఫ్ సైన్స్ స్ రంగాల్లో హైదరాబాద్ సత్తా చాటింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మంచి భవిష్యత్ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ తెలంగాణ ముందువరసలో ఉంది. జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్ లోనే తయారైంది. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి తెలిపారు. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు ఎంతో అవకాశం ఉందన్న కెటిఆర్… మంచి పనులు చేస్తున్నాం. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటేసి గెలిపించండని ప్రజలను కోరారు.
KTR Participating in Brand Hyderabad Future Ready Session at HICC