Sunday, September 8, 2024

కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధానంపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి పాలన పగ్గాలు చేపట్టారని మండిపడ్డారు. 120 రోజుల్లో నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించి, ఇప్పుడు అలాంటి మాటే మాట్లాడలేదని భట్టి మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కానీ, వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తా పత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చిందని, వాస్తవానికి బిఆర్‌ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి,

ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2000లకు (2 పేపర్లకు) పెంచిందని మండిపడ్డారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో కోర్టు కేసులు వేసి, అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు..నిరుద్యోగుల ఉసురుపోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎంఎల్‌సి అందుకున్నాడు కానీ ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితి కాంగ్రెస్ వదిలేసిందని వాపోయారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని పేర్కొన్నారు. తమని నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News