ఎస్ఆర్డిపి పథకం కింద హైదరాబాద్లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఫలక్ నుమా ఆర్ఒబిని పట్టించుకునే పరిస్థితి లేదు అని ఆరోపించారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చంచల్ గూడా జైలుకు పంపే శ్రద్ద దాని ముందున్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడంపై లేదని,శిల్పా లే అవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవెల్ వంతెనది అదే దుస్థితి అని విమర్శించారు. శాస్త్రిపురం ఆర్ఒబి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్ చేశారు..కానీ నిర్మాణంలో ఉన్నవాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశాని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, కక్ష తీర్చుకోవడమేనా..? అని ప్రశ్నించారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతల మీద ఉన్న శ్రద్ద నిర్మాణాల మీద లేదా..? అని నిలదీశారు. అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం, బుల్డోజర్లను ఉసిగొల్పడం కాదని దుయ్యబట్టారు.
బోడ బాజీ అమ్మకి నా వందనం : కెటిఆర్ బావోద్వేగం
ఓ గిరిజన వృద్ధురాలు.. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకోవడం పట్ల కెటిఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు వచ్చిన రూ. 2 వేల పెన్షన్లో నుంచి రూ. వెయ్యి తన పెద్ద కొడుకు కెసిఆర్కు ఇవ్వాలని మాజీ ఎంపీ మాలోత్ కవితకు అందజేశారని చేశారని..ఇంత ఆప్యాయత, ప్రేమ తెలంగాణల కేవలం కెసిఆర్కే సొంతం అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఒక రాజకీయ నాయకుడు కాదు…ఎంతో మందికి పెద్ద కొడుకు అని, తమ పార్టీని నడిపించే నాయకుడు అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని ధారపోసిన దార్శనీకుడు అని వ్యాఖ్యానించారు. ఎన్ని ఢిల్లీ పార్టీలు ఉన్నా…తెలంగాణ ఇంటి పార్టీ బిఆర్ఎస్ అని చెప్పారు. మాది పేగు బంధం…బోడ బాజీ అమ్మకి నా వందనం అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.