2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ను ఆఖర్లో చేజార్చుకున్న భారత జట్టు.. 2024లో జరిగిన టీ-20 ప్రపంచకప్ను ముద్దాడింది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. భారత జట్టు ప్రపంచకప్ను గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే ఈ ఆనందం ఎంతో సేపు లేదు. ప్రపంచకప్ గెలిచామని సంతోషించే లోపే.. తమ అభిమాన క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ-20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అయితే పాకిస్తాన్ వేదికగా జరిగి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా అభిమానులకు ఈ విధంగానే షాక్ తగిలే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ జోస్యం చెప్పారు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్ గ్రూప్-ఎలో ఉండగా.. అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ గ్రూప్-బిలో తలపడనున్నాయి. అయితే ఎనిమిది సంవత్సరాల జరుగుతున్న ఈ టోర్నమెంట్లో విజేతగా నిలవాలని ప్రతి జట్టు కసరత్తు చేస్తున్నాయి.
కానీ, ఈ టోర్నమెంట్ తర్వాత భారత జట్టు అభిమానులకు ఈ చేదు వార్త అందే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. టీ-20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్, జడేజాలు ఈ సిరీస్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. తన యూట్యూబ్ ఛానెల్లో ఓ అభిమానికి సమాధానం ఇస్తూ‘ఈ టోర్నమెంట్ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ జరగనుంది. అందులో భారత్ ఆడే అవకాశం లేదు. మళ్లీ వన్డే ప్రపంచకప్ 2027లో జరుగనుంది. దానికి చాలా సమయం ఉంది. అప్పటివరకూ ఈ ముగ్గురు జట్టులో ఉండే అవకాశం లేదు. దీంతో ఇదే వీరికి చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చు’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.